Illegal Buildings Demolition: పుల్లంపేటలో రోడ్డు విస్తరణ పనులు.. ఇళ్లు కూల్చివేతతో బాధితుల ఆందోళన
Illegal Buildings Demolition in Annamayya District: అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్రమంగా నిర్మించిన కట్టడాలను ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. హైకోర్టు వెళ్లి స్టే తెచ్చుకున్న కొంతమంది ఇళ్లను మాత్రం అధికారులు కూల్చలేదు. మిగతా ఇళ్లను అన్నింటిని కూడా మార్కు ప్రకారం తొలగించారు. పుల్లంపేట నుంచి చిట్యాలకు వెళ్లే మార్గంలో రహదారి విస్తరణ కోసం సర్వే చేసి రోడ్డుపైకి వచ్చిన ఇళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారులు నోటీసులు ఇచ్చి దాదాపు 20 రోజులు గడుస్తున్నా ఎవరూ స్పందించకపోవడంతో రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖ అధికారులు పోలీసుల సహకారంతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నామని.. ఏ రోజు కూడా ఏ అధికారి ఇవి అక్రమ కట్టడాలు అని తెలపకపోవడంతో వాటిలోనే నివాసం ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఇప్పుడు ఆకస్మాతుగా అధికారులు వచ్చి ఇళ్లను కూల్చివేయడంతో పుల్లంపేటలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ కూల్చివేతలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల హస్తం ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటి యజమాని మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు స్థానిక వైసీపీ నాయకునికి తొత్తులుగా మారి ఇక్కడ ఉంటున్న వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.