ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అలుపెరగని సేవాయోధుడు... కరోనా బాధితులకు ఆపద్బాంధవుడు

By

Published : Aug 15, 2020, 7:24 PM IST

గత నాలుగు నెలలుగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పల్లె, పట్టణం, నగరం అని తేడా లేకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మృతుదేహాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బంధువులే దగ్గరకు రాని పరిస్థితి. సంబంధికులే భయపడుతున్న తరుణంలో... సేవే లక్ష్యమంటూ ముందుకు కదిలాడు ఓ చిరు ఉద్యోగి. పగలు, రాత్రి సంబంధం లేకుండా కరోనా బాధితుల సమాచారం అందగానే వెళ్లి వారికి సాయం చేస్తున్నారు. కరోనా బాధితుల్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలకు మంత్రులు సైతం ప్రశంసిస్తున్నారు.

అలుపెరగని సేవాయోధుడు... కరోనా బాధితులకు ఆత్మీయ బంధువు
అలుపెరగని సేవాయోధుడు... కరోనా బాధితులకు ఆత్మీయ బంధువు

కడప జిల్లా రాయచోటి పురపాలిక కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మల్లికార్జున.. తన విధులు నిర్వహిస్తూనే, విరామ సమయంలో కరోనా బాధితులకు సాయపడుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడిన ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచి, వారిలో మనోధైర్యం నింపుతున్నారు. బాధితులకి వైద్యం అందిస్తూ, కొవిడ్ కేంద్రాల్లో చేర్పిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు నిర్ధరణ పరీక్షలు చేయించి, ప్రభుత్వపరమైన సేవలను అందిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఆహారం తయారుచేసి అనాథలకు పంపిణీ చేశారు. మల్లికార్జున సేవలకు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.

కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు

కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులే ముందుకు రావడంలేదు. అలాంటిది మల్లికార్జున ఆ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. రాయచోటిలోని ఓ మసీదులో బీహార్ కు చెందిన మౌజన్ కరోనాతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని తాకేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మల్లికార్జున.. ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఉప తహసీల్దార్ కరోనాతో బాధపడుతూ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలుసుకున్న మల్లికార్జున ఆయన ఇంటికి వెళ్లి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దురదృష్టవశాత్తు ఉప తహసీల్దార్ ప్రాణాలు కోల్పోయారు. బంధువులు ఎవరు అంత్యక్రియలు చేసేందుకు రాకపోతే మల్లికార్జున అధికారుల సాయంతో అంత్యక్రియలు పూర్తి చేయించారు.

మంత్రుల ప్రశంసలు

కడపలో జరిగిన 74వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో...జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జునను మంత్రులు ప్రశంసించారు. వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ మల్లికార్జున సేవలను ప్రశంసిస్తూ కొవిడ్ వారియర్స్ ప్రశంస పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

విజయసాయిరెడ్డి గారు ... సవాల్​ను స్వీకరిస్తున్నా: అయ్యన్నపాత్రుడు

ABOUT THE AUTHOR

...view details