పల్లెపోరు కాక పుట్టిస్తోంది. స్థానిక సమరానికి నేతలు, ఆశావహ అభ్యర్థులు సై అంటున్నారు. గెలుపే లక్ష్యంగా నాయకులు వ్యూహం రచిస్తున్నారు. మరోవైపు సంగ్రామం సజావుగా సాగేలా జిల్లా యంత్రాంగం అప్రమత్తమవుతోంది. గతంలో ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక సంఘటనలపై క్షేత్రస్థాయి నుంచి జిల్లా అధికారులు సమాచారాన్ని తెప్పించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, తాజా పరిస్థితులను బేరీజు వేసుకొని ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో సాధారణ విభాగంలో 20 శాతం లోపే ఉన్నాయి. సమస్యాత్మకం 68.19 శాతం ఉండగా, అతి సమస్యాత్మక కేంద్రాలు 11.90 శాతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు.
ఇది ఒంటిమిట్ట గ్రామం ముఖచిత్రం. గత ఎన్నికల్లో జరిగిన ఘర్షణలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు 12 వార్డులను అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాలోకి చేర్చారు. జిల్లాలో కడప, జమ్మలమడుగు, రాజంపేట డివిజన్ల పరిధిలో 50 మండలాలు ఉన్నాయి. 807 గ్రామ పంచాయతీల్లో 7,904 వార్డులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. న్యాయపరమైన చిక్కులు రావడంతో 14 పంచాయతీల్లో పల్లెపోరు ఆపేశారు. మూడు డివిజన్లలో నాలుగు దశల్లో 368 క్లస్టర్లు, 793 పంచాయతీల్లో ఉన్న 7,762 వార్డులకు ఎన్నికల క్రతువు జరుగుతోంది. ఇందుకోసం 7,903 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం ఏం వసతులు ఉన్నాయి.. ఇంకా ఏమేమి కల్పించాలో ఆరా తీస్తున్నారు. ఎలాంటి రాజకీయ సమస్యల్లేని సాధారణ పోలింగ్ కేంద్రాలు 1,574 (19.91 శాతం) ఉన్నట్లు నిర్ధారించారు.
గతేడాది మార్చిలో మండల, జిల్లా పరిషత్తులకు ఎన్నికలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 554 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా 415, తెదేపా ఆరు, ఇతరులు మూడింట్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 50 జడ్పీటీసీ స్థానాల్లో 38 ఏకగ్రీవమయ్యాయి. ఈలోపు కొవిడ్ ప్రభావంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పరిషత్తు పోరును వాయిదా వేశారు. ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాల పరిధిలోని పంచాయతీలను సమస్యాత్మక ప్రాంతాలుగా పరిగణనలోకి తీసుకోవాలని ఎస్ఈసీ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సమస్యాత్మక కేంద్రాలు, గొడవలు జరిగేందుకు ఆస్కారమున్న ప్రాంతాల వివరాలను తాజాగా గుర్తించి నివేదించారు.
ప్రత్యేక బందోబస్తు