ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యం భారీగా పట్టుబడుతోంది. రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో దళారులు బయటి రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలించి లక్షలు దండుకుంటున్నారు. ఏపీ పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నా.. అక్రమ మద్యం వ్యాపారం ఏమాత్రం ఆగడంలేదు.
తాజాగా కడప సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా 826 మద్యం సీసాలను స్వాధీనపరచుకున్నారు. దీని విలువ రూ.11 లక్షలు కాగా రూ.12.50 లక్షలు విలువ చేసే మూడు కార్లు జప్తు చేశారు. ఎర్రగుంట్ల గ్రామీణ సీఐ ఉలసయ్య వీఎన్.పల్లె ఎస్సై మల్లికార్జున్రెడ్డి కడప-పులివెందుల రోడ్డులోని తంగెడుపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దుండగులు మూడు కార్లలో వస్తూ పోలీసులను చూసి వాహనాలను వెనక్కు తిప్పి పరారవుతుండగా పోలీసులు కార్లను వెంబడించి పట్టుకున్నట్లు చెప్పారు. కార్లను తనిఖీ చేసి 826 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తక్కువకు కొనుగోలు చేసి కడపలో అధిక ధరలకు విక్రయించేందుకు పథకం వేసుకుని తెచ్చినట్లు తెలిపారు. మూడు కార్లు, స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు.