కడప జిల్లా రాజంపేట మండలంలో ఆకేపాడు గ్రామంలో ఒకేరోజు పలు ఆలయాల్లో హుండీ చోరీలు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి హుండీలను అపహరించుకుపోయారు. కొన్ని ఆలయాల్లో హుండీలు కనిపించకపోగా.. మరికొన్ని ఆలయాల్లో హుండీలను ఆలయాల సమీపంలో పడేశారు. ఆకేపాడు ప్రాంతంలో ఒకేరోజు పలు ఆలయాల్లో చోరీలు జరగడంతో డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఐ నరేందర్ రెడ్డి, ఎస్సై షేక్ రోషన్లతో కలిసి చోరీ జరిగిన ఆలయాలను పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు కడప నుంచి వేలిముద్ర నిపుణులను పిలిపించారు.
ఆలయాల్లో చిన్న చిన్న హుండీలు మాత్రమే చోరీకి గురయ్యాయని డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఆలయాల్లోని విగ్రహాలకు ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తులను రెండు మూడు రోజుల్లో పట్టుకుంటామని ఆయన చెప్పారు.