ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 5, 2021, 7:56 AM IST

ETV Bharat / state

'ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేసినా.. పట్టించుకోరా?'

సమస్యలను పరిష్కారించాలంటూ ఫ్రంట్​లైన్ వారియర్స్ రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహించారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతన బకాయిలు, ఉద్యోగా ధీమా అందించాలని డిమాండ్ చేశారు. ఈనెల 8,9 తెదీలలో సంతకాల సేకరణ నిరసనలు తెలపనున్నారు. మరోవైపు.. జిల్లాల్లో కోవిడ్ రెండో విడత వ్యాక్సినేషన్ కొనసాగింది. కొందరు ఐఏఎస్ అధికారులు టీకా వేయించుకున్నారు.

covid warriors protest
ఏపీలో కోవిడ్ వారియర్స్ ధర్నా

కోవిడ్ వారియర్స్ ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆందోళన కొనసాగించారు. తమ వేతన బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కోవిడ్ విధుల నుంచి తొలగించిన సిబ్బందిని తిరిగి నియమించాలని, వేతన బకాయిలను చెల్లించాలని, సర్వీస్ సర్టిఫికెట్లు అందజేయాలని డిమాండ్ చేశారు.

కోటి సంతకాల సేకరణ

కరోనా సమయంలో కోవిడ్ వారియర్స్ గా తాము అందించిన సేవలు అందరి ప్రశంసలు అందుకున్నాయని కరోనా వారియర్స్ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల మంది వారియర్స్ జీతాలు సక్రమంగా అందకపోయినా సేవలందించారని తెలిపారు. అలాంటివారికి ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి కోటి సంతకాల ఉద్యమాన్ని చేపడుతున్నామన్నారు. 9వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పోస్టు కార్డుల ద్వారా తమ బాధలు తెలుపుతామని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోగా తమ సమస్యలు పరిష్కరించకుంటే ఛలో అసెంబ్లీకి సన్నద్ధం అవుతామని హెచ్చరించారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి..

అనంతపురం శివారులోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వారు కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ర్యాలీ నిర్వహించారు. కరోనా కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులను నిర్వహించామని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా..

కొవిడ్‌ టీకా తయారీలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం బర్మాకాలనీలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. కోవాగ్జిన్ టీకా వేయించుకున్నారు. 28 రోజుల తరువాత మరల ఇదే టీకా మాత్రమే తీసుకోవాలని అధికారులు కలెక్టర్‌కు సూచించారు. జిల్లాలో జనవరి 16వ తేదీన వైద్యులు, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కాగా... ఇప్పటికి 14 వేల మంది వైద్య సిబ్బందికి టీకా తీసుకున్నారన్నారని కలెక్టర్ తెలిపారు.

వ్యాక్సిన్ పై ప్రజలు అపోహాలు వీడాలి

కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో విడత కార్యక్రమాన్ని అనంతపురంలో ప్రారంభించారు. నగరంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందికి కోవిడ్ టీకాను అందించారు. వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేవని డాక్టర్ రాజేష్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తోన్న ఈ టీకాపై ప్రజలు అపోహలకు వీడాలని కోరారు.

ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి..

కోవిడ్ వ్యాక్సిన్లపై అపోహలు వీడి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కోరారు. కాకినాడలోని జీజీహెచ్​లో కలెక్టర్, డీఎంహెచ్ఓ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సినేషన్ లో తూర్పుగోదావరి జిల్లా రాష్టంలో ప్రథమ స్థానంలో ఉన్నా.. ఇక్కడ తొలివిడతగా 60 శాతం మంది ఆరోగ్య సిబ్బంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. మిగిలిన వారితోపాటు.. రెండో విడతలో ఉద్యోగులు కూడా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు.

ఇదీ చూడండి:

కొవిడ్ వ్యాక్సినేషన్: రాష్ట్రంలో 28 వేల మందికి టీకాలు

ABOUT THE AUTHOR

...view details