ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన షేక్ హిమామ్ షాకు ప్రపంచంలోని ఎత్తయిన శిఖరాలను అధిరోహంచాలనేది ఆశయం. కానీ కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాపీ మేస్త్రీ పనిచేసే తండ్రి మస్తాన్ ఆదాయంపైనే కుటుంబమంతా ఆధారపడి ఉంది. అయినప్పటికీ వెనుకడుగు వేయలేదు ఆ యువకుడు. 2018లో రాష్ట్రం నుంచి ఎవరెస్టు అధిరోహించే బృందంలో హిమామ్ అగ్రగామిగా నిలిచాడు. ఎవరెస్టు శిఖర అధిరోహణకు రాష్ట్రం నుంచి 130 మంది ఉత్సాహం చూపగా.. చివరికి అవకాశం దక్కింది ఐదుగురికి మాత్రమే. ఇందులో ఒంగోలుకు చెందిన హిమామ్ ఒకరు. మైనస్ 40 డిగ్రీల అతి శీతల వాతారణంలో ఈ ఐదుగురు నడక ప్రారంభించగా వీరిలో మొట్టమొదటిగా షేక్ హిమామ్ షా చేరుకున్నాడు. టిబెట్ మీదుగా ఎవరెస్టు శిఖరం ఎక్కడమంటే మరణంతో ప్రయాణం చేయడమే... అలాంటి ప్రయత్నాన్ని ఆయన ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా ముగించాడు.
ప్రకాశం జిల్లా నుంచి ఒకేఒక్కడు
ఎంతో కఠినతరంగా ఉండే 9 దశలను దాటుకొచ్చి, పర్వతారోహణకు అర్హత సాధించిన హిమామ్షా... 2018 మే 16వ తేది అర్ధరాత్రి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. భారత్ తరపున ఉత్తరం వైపు నుంచి పర్వతాన్ని ఎక్కిన మొదటివ్యక్తి హిమామ్ కాగా... 2018 లో ఎవరెస్టు ఎక్కిన వారిలో మొదటివాడు ఇతడే. ప్రకాశం జిల్లా నుంచి ఎవరెస్టును అధిరోహించిన తొలి వ్యక్తి హిమామ్.