కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1983 ప్రాథమిక, 367 ప్రాథమికోన్నత, 603 ఉన్నత పాఠశాలల్లో మొత్తంగా 15,188 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరిని గత నెల 22 నుంచి విద్యార్థులు లేకుండా పాఠశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. శనివారం 7,659(50.43)మంది హాజరు కాగా 7,529(49.57)మంది హాజరు కాలేదు. ఇందులో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారితోపాటు గర్భిణులు, శారీరక వైకల్యం కలిగిన ఉపాధ్యాయులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. జిల్లాలో అధికారులు పది మున్సిపాలిటీలు, 47 మండలాలు కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించారు. ఈ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రస్తుతం జిల్లాలో కరోనా విజృంభిస్తుండటంతో బయోమెట్రిక్ యంత్రాల్లో హాజరు వేయడానికి గురువులు భయపడుతున్నారు. హాజరవుతున్న వారిలో ఏ ఒక్కరికి వైరస్ సోకినా అందరూ క్వారంటైన్కు వెళ్లాల్సి వస్తుందని బయోమెట్రిక్ వేయడానికి ముందుకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయకపోవడం, మరికొన్నింటికి నెట్వర్క్ లేక మూలనపడ్డాయి. హాజరుకు విద్యాశాఖ వేలిముద్ర యంత్రాలనే ప్రామాణికం చేసుకోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.
కరోనా దృష్ట్యా బయోమెట్రిక్ హాజరు వినియోగించరాదని మార్చిలో ఆదేశాలు ఇచ్చిన విద్యాశాఖ తాజాగా అదే యంత్రాల్లో హాజరు వేయాలని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ ఇచ్చిన పనుల్లో ఒకరిద్దరు చేయాల్సిన పనుల కోసం ఉపాధ్యాయులందరూ హాజరుకావాలని ఆదేశించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఉపాధ్యాయులను అడ్డుకున్న గ్రామస్థులు