ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 7, 2020, 8:02 AM IST

ETV Bharat / state

'రైతన్నను వేధిస్తోన్న ఉల్లి'

మార్కెట్లలో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకున్నాయి. ఉల్లిని తాకేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మంచి ధరలు వస్తున్నాయని అందరూ భావిస్తారు.కానీ ఇందుకు విరుద్ధం. వర్షాల వల్ల పంటలన్నీ నష్టపోగా..అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నేటిపాలుకాగా..అప్పులు పెరిగిపోయాయి.

onion problems at karnool market
కర్నూలు మార్కెట్​లో ఉల్లి ధరలు

ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లాలో 45 వేల ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశారు. పంట చేతికి వస్తున్న సమయంలో... వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. కుండపోత వర్షాలు కురవటంతో... పంట తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా... దిగుబడులు గణనీయంగా తగ్గాయి. అప్పటికే బాగా పెట్టుబడులు పెట్టిన రైతులు పంట నష్టపోవటంతో లబోదిబోమంటున్నారు

తడిసిమోపడవుతున్న పెట్టుబడులు

ఉల్లిపంటకు పెట్టుబడులు ఎక్కువగానే అవుతాయి. ఎకరానికి 50 నుంచి 70 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మంచి దిగుబడులు వస్తే... ఎకరానికి సుమారు వంద క్వింటాళ్ల వరకు పంట వస్తుంది. వర్షాల కారణంగా... ఎకరానికి 50 క్వింటాళ్లు సైతం రావటం లేదు. మరోవైపు ఉల్లిగడ్డల్లో నాణ్యత లోపించటం, తేమ శాతం ఎక్కువగా ఉండటంతో మంచి ధరలు రావటం లేదు. దీనికి తోడు కోత కూలీలు, రవాణా ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి వంద రూపాయలు పలుకుతున్నా... తమకు మాత్రం కిలోకు 30 రూపాయలు కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు.

కర్నూలు మార్కెట్​లో ఉల్లి ధరలు

గిట్టుబాటు ధరలు రావట్లేదు

ప్రస్తుతం కర్నూలు మార్కెట్ కు తక్కువగానే సరుకు వస్తోంది. మార్కెట్లో ఉల్లిగడ్డల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అయినా రైతులకు గిట్టుబాటు ధరలు రావటం లేదు. సరాసరిన రోజుకు 2 వేల క్వింటాళ్లు... అంతకంటే తక్కువగా సరుకు వస్తోంది. కనిష్ట ధర 6 వందలు, గరిష్ట ధర 5 వేలా 6 వందలు, సరాసరి ధర 3 వేల రూపాయల వరకు పలుకుతోంది. మంచి నాణ్యమైన ఉల్లి గడ్డకు కిలోకు 50 రూపాయల వరకు వస్తుంటే... నాణ్యతలేని గడ్డకు 6, 7 రూపాయలు మాత్రమే వస్తోంది. తమకు మాత్రం గిట్టుబాటు ధరలు రావట్లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి.మిషన్ సాగర్ II : ఎరిత్రియాకు ఆహార ప‌దార్థాల‌ను అంద‌జేసిన‌ ఐఎన్ఎస్ ఐరావత్ నౌక‌

ABOUT THE AUTHOR

...view details