ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 2, 2020, 6:03 AM IST

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​ : పనిలేక పస్తులుంటున్న శిల్పకళాకారులు

కరోనా ప్రభావం శిల్ప కళాకారులపైనా పడింది. ఒకప్పుడు చేతినిండా పనితో తీరికలేకుండా గడిపిన కళాకారులకు నేడు పూట గడవడం కష్టంగా మారింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శిల్పుల దీనస్థితిపై ప్రత్యేక కథనం.

కరోనా ఎఫెక్ట్​ : పనిలేక పస్తులుంటున్న శిల్పకళాకారులు
కరోనా ఎఫెక్ట్​ : పనిలేక పస్తులుంటున్న శిల్పకళాకారులు

కరోనా ఎఫెక్ట్​ : పనిలేక పస్తులుంటున్న శిల్పకళాకారులు

బండరాళ్లకు జీవం పోయడంలో ఆరితేరిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ గుంప్రామాన్‌ దిన్నెకు చెందిన శిల్పకారుల పరిస్థితి దయనీయంగా మారింది. తాత ముత్తాతల కాలం నుంచి శిల్ప వృత్తిలో కొనసాగుతున్న కళాకారులు పట్టణ ప్రాంతంలో ఆదరణ బాగుంటుందనే ఉద్దేశంతో 1950లో ఆళ్లగడ్డలో శిల్పశాల ఏర్పాటు చేసుకున్నారు. 80వ దశకం నుంచి శిల్పులకు భారీగా డిమాండ్‌ పెరిగింది. గుంప్రామాన్‌ దిన్నెకు చెందిన చాలా మంది ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆళ్లగడ్డలో సుమారు 100 శిల్పశాలలు ఉండగా వాటిలో 500 మంది విగ్రహాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.

మొదట్లో శిల్పలు దేవతామూర్తుల విగ్రహాలు మాత్రమే తయారు చేసేవారు. అవసరాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, గృహాలంకరణ, ఉద్యానవనాల కోసం విగ్రహాలు చెక్కడం ప్రారంభించారు. అమెరికా వెళ్లి 3 నెలలు కష్టపడి వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి వచ్చారంటే వీరి నైపుణ్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో శిల్పాల తయారీ కేంద్రం నుంచి సరాసరిన 50 లక్షల రూపాయల వ్యాపారం జరిగేది.

కరోనా వల్ల ఇప్పుడు వీరి వ్యాపారం దెబ్బతింది. మార్చి నెల నుంచి ఆర్డర్లు కరవయ్యాయి. విగ్రహాలకు బయానా ఇచ్చిన వారు సైతం వాటిని తీసుకువెళ్లడం లేదు. ఆలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠలు, గృహ నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్ల పనిలేక కళాకారులు ఇబ్బందిపడుతున్నారు. ఇంటి అద్దె చెల్లించేందుకూ ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు.

విగ్రహాలకు డిమాండ్ తగ్గడం వల్ల వీటిపై ఆధారపడి జీవించే సుమారు 2 వేల మంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కష్టకాలంలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని శిల్పకారులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి :గొప్ప మనిషికి నా సైకతం అంకితం: సనత్ కుమార్

ABOUT THE AUTHOR

...view details