Protest for cemetery: శ్మశాన వాటికకు స్థలం చూపాలనే డిమాండ్తో కోనసీమ జిల్లా మండపేట మండలం అర్తమూరులో ఎస్సీలు చేపట్టిన నిరసన బుధవారం తీవ్రరూపం దాల్చింది. ఇక్కడ శ్మశానవాటిక లేదని గతంలో స్పందన కార్యక్రమంలో కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఒక స్థలాన్ని పరిశీలించారు. అక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేయవద్దని పరిసరాల్లోని రైతులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. మరోవైపు రోడ్డు పక్కన మృతదేహాలను ఖననం చేయకూడదంటూ ర.భ.శాఖ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు.
ఈ పరిస్థితుల్లో సోమవారం గిరిసాల రాముడు అనే వృద్ధుడు మృతి చెందడంతో ఎక్కడ ఖననం చేయాలో తెలియని పరిస్థితిలో మంగళవారం మృతదేహంతో పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తహసీల్దారు రాజేశ్వరరావు చర్చలు జరిపి చెరువు పక్కన ఖననం చేయాలని సూచించారు. తీరా అక్కడికి వెళ్లగా కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. దీంతో శవాన్ని ఫ్రీజర్లో ఉంచి పంచాయతీ కార్యాలయంవద్ద మంగళవారం రాత్రంతా వర్షంలోనే ధర్నా కొనసాగించారు.