కరోనా విజృంభణతో ఇంటి నుంచి బయటికి వెళ్లడానికే భయపడుతున్న వేళ తపాలా ఉద్యోగులు ఇంటికే వచ్చి సేవలు అందిస్తుండడంతో ఎంతో మందికి ఊరట లభిస్తోంది. బ్యాంకులకు వెళ్ల లేని వారు, కరోనాతో ఇంటి నుంచి కదల్లేనివారు, నడవలేని స్థితిలో ఉన్నవారు నగదు కావాలని కోరిన నిమిషాల వ్యవధిలో తపాలా సిబ్బంది ఇంటికే వచ్చి వారి ఖాతా నుంచి సొమ్ము ఇస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన ఉత్తరాలు, మందులు, పెద్దాస్పత్రులకు వస్తున్న పీపీఈ కిట్లు, పరీక్షల కిట్లు, ఇతర వైద్య పరికరాలు, మందులు తదితరాలన్నీ కూడా తపాలా సిబ్బంది ద్వారా ఆయా ఆసుపత్రులకు అందుతున్నాయి. కార్యాలయం వేళలు కుదించినా అందుకు అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది పని విభజన చేసుకుని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందించే సేవల్లో లోపాలు తలెత్తకుండా చూస్తున్నారు. కరోనా విపత్తు వేళ తపాలా ఉద్యోగులు కొందరు కరోనా బారినా పడినా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.
ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలి
తపాలాశాఖ సిబ్బంది ఉత్తర ప్రత్యుత్తరాలు, పార్శిళ్లు అందించడంలో భాగంగా ప్రజలను కలవాల్సి వస్తోంది. పార్శిళ్లు ఇచ్చిన తర్వాత వారితో సంతకం చేయించుకోవాలి. ఏఈపీఎస్ ద్వారా నగదు ఇచ్చే క్రమంలో లబ్ధిదారుని నుంచి వేలిముద్ర వేయించుకోవాలి. ఈ క్రమంలో తపాలా ఉద్యోగులు కరోనా బారిన పడే అవకాశం ఉంది. కార్యాలయాల్లో నగదు లావాదేవీలు, ఇతర పత్రాల ఇచ్చిపుచ్చుకోవడంలో కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తపాలా ఉద్యోగులు, సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి వ్యాక్సిన్ వేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 120 మంది ఉద్యోగులు కరోనా బారిన పడగా 35 మంది రికవరీ అయ్యారు. 8 మంది మృత్యువాత పడగా 77 మంది హోం ఐసొలేషన్, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అత్యవసరాలకు తొలి ప్రాధాన్యం
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు, మంగళగిరిలోని ఎయిమ్స్కు దిల్లీ, చెన్నై నుంచి ఐసీఎంఆర్, ఇతర సంస్థల నుంచి పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రి విమానాల ద్వారా విజయవాడకు వస్తున్నాయి. వాటికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా గుంటూరు నుంచి వెంటనే సిబ్బంది, వాహనాన్ని పంపి ఆయా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. విజయవాడకు వచ్చిన సామగ్రిని గంటల వ్యవధిలోనే ఆస్పత్రులకు చేరవేస్తున్నారు. జిల్లాలోని ప్రజలకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు మెడికల్ కిట్లు, అత్యవసరాలకు సంబంధించిన సామగ్రి పంపుతున్నారు. పార్శిల్పై అత్యవసరం అని రాసినట్లయితే వచ్చిన వెంటనే వాటిని వేరు చేసి అదే రోజు అందేలా చూస్తున్నారు. ఒక్కొక్కసారి రాత్రి వేళ సైతం వారికి అందిస్తున్నారు.
ఇంటి వద్దే రూ.12.51కోట్ల సొమ్ము పంపిణీ