ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికారుల విచారణ.. అర్హులైన లబ్ధిదారుల వివరాల సేకరణ

By

Published : Aug 28, 2021, 5:29 PM IST

నివర్ తుపానుతో పంట నష్టపోయిన రైతుల వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు పరిహారం అందుతోందని బాధితులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో గుంటూరు జిల్లా కారంపూడిపాడు గ్రామంలో అధికారులు విచారణ చేపట్టారు.

కారంపూడిపాడులో అధికారుల విచారణ
కారంపూడిపాడులో అధికారుల విచారణ

గతంలో నివర్ తుపానుతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే విషయంలో అవకతవకలు జరిగాయని.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో సమగ్ర విచారణ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళి, ఏడీఏ శ్రీనివాసరావు లు కారంపూడిపాడు గ్రామానికి చేరుకుని విచారణ చేశారు.

పొలం లేని వాళ్లు, కౌలుకు సాగు చేయని వారి పేర్లను ఆన్​లైన్​లో నమోదు చేశారని రైతులు ఆరోపించారు. విచారణ కోసం అధికారులు వస్తే.. అక్రమంగా నగదు తీసుకున్న వారు హాజరు కాలేదని రైతులు తెలిపారు. వారు తీసుకున్న నగదును రికవరీ చేసి, బాధిత రైతులకు ఇవ్వాలని కోరారు. జాబితాలో ఉన్న వారిని విచారించి నివేదిక తయారు చేసి కలెక్టర్ కు ఇస్తామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఘర్షణ జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details