ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలుడి అపహరణ కేసును ఛేదించిన పోలీసులు

గుంటూరు జిల్లా నంబూరులో రెండేళ్ల బాలుడి అపహరణ ఉదంతాన్ని పోలీసులు సుఖాంతం చేశారు. కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసులు.... క్షేమంగా బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లాడిని అపహరించి రూ.రెండు లక్షలకు అమ్ముకుందామన్న ఓ ముఠా కుట్రను భగ్నం చేశారు. అపహరణకు పాల్పడిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేయటంతోపాటు రూ.1.20లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కుమారుడిని క్షేమంగా అప్పగించిన పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.

By

Published : Feb 28, 2021, 3:32 PM IST

Updated : Feb 28, 2021, 5:53 PM IST

namburu kidnap case
నంబూరు బాలుడి అపహరణ కేసు

పిల్లలను అపహరించి గుట్టుగా అమ్ముకుందామన్న ముఠా ప్రయత్నాలను గుంటూరు అర్బన్ పోలీసులు భగ్నం చేశారు. ఈ నెల 24న గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు యానాది కాలనీలో రెండేళ్ల బాలుడు జీవ.. అపహరణకు గురయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న కుర్రాడు ఒక్కసారిగా అదృశ్యమయ్యేసరికి తల్లి బాలకు అనుమానం వచ్చింది. అంతకుముందు కారు ఆపి తనను నీళ్లు కావాలని అడిగినవారే.. ఆ పని చేశారని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

బాలుడి అపహరణ కేసును సవాల్​గా తీసుకున్న పోలీసులు.... కారుతోపాటు ఇతర సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించి ముఠా ఆట కట్టించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్​కు చెందిన అనిశెట్టి సువర్ణ, అనిశెట్టి దుర్గా ప్రసాద్, అమరాలపూడి శ్రీనివాసరావు, పోకూరి సాగర్, కడప పట్టణంలోని బాలాజీనగర్​కు చెందిన వరదా చంద్రిక ప్రతిభా భారతి అలియాస్ చంద్రిక, విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా బంగారయ్యపేటకు చెందిన దుర్గాడ వేణును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు వర్మ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి రూ.1,20,000, 10 లక్షలు విలువచేసే కారు, చరవాణిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డీఐజీ త్రివిక్రమ వర్మ

కారు విజయవాడకు చెందిన శివ అనే వ్యక్తిదిగా గుర్తించిన పోలీసులు....అక్కడ నుంచి తీగలాగితే డొంక కదలింది. వేణు అనే అమ్మాయికి మగపిల్లాడిని అమ్మేందుకు రూ.2 లక్షలకు సువర్ణ, చంద్రిక చేసుకున్న ఒప్పందమే... పిల్లాడు జీవ అపహరణకు కారణమని పోలీసు అధికారులు తెలిపారు. అపహరణ ఉదంతంలో కీలకపాత్ర పోషించిన భార్యాభర్తలు సువర్ణ, దుర్గాప్రసాద్ తోపాటు అతనికి సహకరించిన మిగతా నిందితులను అరెస్టు చేశామని డీఐజీ త్రివిక్రం వర్మ, ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన పోలీసు సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డులు అందజేశారు.

తమ కుమారుడిని తిరిగి క్షేమంగా అప్పగించినందుకు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు.

ఇదీ చదవండి:

కిడ్నాప్​న​కు గురైన బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ అమ్మిరెడ్డి

Last Updated : Feb 28, 2021, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details