AP Government Talks with Anganwadi Associations: అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయి. సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో మరోసారి ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలకు మంత్రి బొత్స, సలహాదారు సజ్జల, అంగన్వాడి సంఘాల నేతలు హాజరయ్యారు. అంగన్వాడిలతో సమ్మె విరమింప చేసేలా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ వేతనాలు పెంచాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ప్రస్తుత తరుణంలో వేతనాల పెంపు సాధ్యం కాదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
అంగన్వాడీల సమ్మెపై సచివాలయంలో ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల చర్చలు జరిపారు. ఐదేళ్లు పూర్తి అయ్యాక వచ్చే ప్రభుత్వంలోనే వేతనాల పెంపు వీలవుతుందని అంగన్వాడీలకు మంత్రులు బొత్స, సలహాదారు సజ్జల తేల్చి చెప్పారు. ప్రస్తుతం అంగన్వాడీలకు వేతనాలు పెంచేందుకు ఏ మాత్రం సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో చర్చలకు ఎందుకు పిలిచారనీ మంత్రుల కమిటీని అంగన్వాడి సంఘాల నేతలు నిలదీశారు.
చర్చలకు వైఎస్ఆర్టీయూసీ ప్రతినిధులు హాజరయ్యారు. వైఎస్ఆర్టీయూసీ ప్రతినిధులు చర్చలకు హాజరు కావడంపై మిగిలిన అంగన్వాడీల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్టీయూసీ ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటే తాము వెళ్లిపోతామని అంగన్వాడీల ప్రతినిధులు తెలిపారు. వారికి అధికారులు సర్దిచెప్పారు.
సమ్మె యథాతథంగా కొనసాగుతుంది: మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి సానుకూల దృక్పథం లేదని అంగన్వాడీల ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకసార్లు చర్చించినా తమ డిమాండ్లు నెరవేర్చలేదని ఆవేదన చెందారు. ఎస్మాకు భయపడేది లేదన్న సుబ్బరావమ్మ, కొత్తవారిని నియమించుకుంటామన్న బెదిరింపులకు భయపడమని తేల్చి చెప్పారు. ఎస్మా ప్రతులను భోగి మంటల్లో కాలుస్తామని, సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు.
అంగన్వాడీల అలుపెరగని పోరాటం - డిమాండ్లు నేరవేర్చాలని డిమాండ్
వేతనాల పెంపుపైనే ప్రధాన సమస్య:అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ఆమోదించామని ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వేతనాల పెంపుపైనే ప్రధాన సమస్య ఉందన్న సజ్జల, అంగన్వాడీల సమస్యపై సానుకూలంగానే ఉండాలని సీఎం చెప్పారన్నారు. గ్రాట్యుటీ విషయంలో కేంద్రానికి లేఖ రాశామని, కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్ను రూ.లక్షా 20 వేలకు, అంగన్వాడీ హెల్పర్ రిటైర్మెంట్ బెనిఫిట్ను రూ.50 వేలకు పెంచుతామని చెప్పారు. వేతనాలను వచ్చే జులైలో పెంచుతామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. అంగన్వాడీలు, హెల్పర్ల టీఏ, డీఏలు క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు.