కాకినాడలో 3 రోజుల క్రితం అపహరణకు గురైన దీప్తిశ్రీ... దారుణ హత్యకు గురైంది. ఆ చిన్నారి మృతదేహం.. ఇంద్రపాలెం లాకుల దిగువన డ్రెయిన్లో బయటపడింది. శుక్రవారం మధ్యాహ్నం అపహరణకు గురైన బాలిక దీప్తిశ్రీ.. విగతజీవిగా కనిపించడం.. బాధిత కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది.
దీప్తిశ్రీ ఆచూకీ కోసం 3 రోజులుగా పోలీసులు విస్తృతంగా శోధించారు. ప్రాథమికంగా లభించిన సమాచారం ప్రకారం.. పినతల్లి హత్య చేసి ఉంటుందని అనుమానించారు. ఉప్పుటేరులో ధర్మాడి సత్యం బృందంతో... రెండ్రోజులపాటు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.
సీసీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా..
మూడ్రోజుల క్రితం దీప్తిశ్రీని సవతితల్లి శాంతకుమారి తీసుకొస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. గోనెసంచి మూటను వంతెనపై పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించాయి. వాటి ఆధారంగానే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంద్రపాలెం లాకులు, ఉప్పుటేరు వద్ద విస్తృతంగా గాలించారు. కాకినాడ నగరం సహా గ్రామీణ మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు జాగిలాలతో వెతికారు.