తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని తెదేపా జిల్లా కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకినాడలో అగ్నిప్రమాదంలో తగలబడిన బోటులో హెరాయిన్ ఉందని తెదేపా నేత పట్టాభి ఆరోపించారని.. బోటు ప్రమాదాన్ని హెరాయిన్ రవాణాతో ముడిపెట్టి మత్స్యకారులను దొంగలుగా చిత్రీకరించారంటూ మత్స్యకారులు, వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 వరకు హైడ్రామా నడిచింది. పట్టాభి మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. విషయం తెలుసుకోవడానికి బయటకు వచ్చిన తెదేపా కాకినాడ పార్లమెంటు అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇతర నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తెదేపా నాయకులపై కొందరు అసభ్యపదజాలంతో విరుచుకుపడితే, మరికొందరు దాడికి దిగారు. పోలీసులు తెదేపా కార్యాలయం ప్రధాన గేటు మూసివేసి.. పట్టాభి, చినరాజప్ప, జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర తెదేపా నాయకులను బయటకు రాకుండా చూశారు. పట్టాభి బయటకొచ్చి క్షమాపణ చెప్పే వరకు కదలబోమంటూ మత్స్యకారులు, వైకాపా కార్యకర్తలు పలుమార్లు కార్యాలయం వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పలువురు వైకాపా కార్పొరేటర్లు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి.
మత్స్యకారులను తప్పుపట్టలేదు: పట్టాభి