ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 1, 2022, 4:18 AM IST

Updated : Feb 1, 2022, 4:43 AM IST

ETV Bharat / state

New Districts in AP: జిల్లాల ఏర్పాటుపై ఆగని ఆందోళనలు... పలు ప్రాంతాల్లో కొనసాగిన దీక్షలు

New Districts In AP: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు ఉద్ధృతమయ్యాయి. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలుగా తమ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొన్నిచోట్ల జిల్లా పేర్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భారీ ప్రదర్శనలు, ధర్నాలతో ప్రజలు తమ నిరసన తెలియజేస్తున్నారు. మార్పులు, చేర్పులు చేయకుంటే మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు.

New Districts In AP
New Districts In AP

New Districts In AP: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. జిల్లా కేంద్రాలు మార్చాలని, పేర్లు మార్చాలని, పరిధుల్లో మార్పు చేయాలని కోరుతూ ర్యాలీలు నిర్వహించారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లా సాధన జేఏసీ, సమితి ఆధ్వర్యంలో సోమవారం పురపాలక సంఘం ముట్టడి నిర్వహించారు. తెదేపా, జనసేన, గిరిజన సంక్షేమ సంఘం, జిల్లా సాధన జేఏసీ, మాలమహానాడు, ఏపీ రైతు సంఘం ప్రతినిధులు ర్యాలీగా వచ్చారు. కొందరు కార్యాలయంపై ఎక్కి నినాదాలు చేశారు. ఆదోని జిల్లా సాధనకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎమ్మిగనూరులో రాయలసీమ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కొనసాగింది.

సీఎం జగన్‌కు రైల్వేకోడూరు ఎమ్మెల్యే లేఖ
కడప జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే ఉంచాలి. లేదంటే రాజంపేటను జిల్లా కేంద్రం చేసి, అన్నమయ్య జిల్లాలో కొనసాగించాలి. ఈ రెండూ కాకుంటే కోడూరుకు 18 కిలోమీటర్ల దూరంలోని బాలాజీ జిల్లాలో చేర్చాలి’ అని విన్నవించారు. మరోవైపు రాజంపేట, రైల్వేకోడూరులో సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు జరిగాయి.

హిందూపురంలో సంతకాల సేకరణ
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా గుర్తించాలని సోమవారం అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో లేపాక్షిలో సంతకాల సేకరణ చేపట్టారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

‘పల్నాడు’కు జాషువా పేరు పెట్టండి
వినుకొండ, గురజాల, నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని గుంటూరు జిల్లా వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోరారు. ఈమేరకు వినుకొండలోని కవికోకిల విగ్రహం వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఇదే విషయమై తెదేపా నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పల్నాడు జిల్లాకు గురజాలను కేంద్రం చేయాలని వివిధ పార్టీల నాయకులు సోమవారం గుంటూరు జిల్లా గురజాలలో ప్రదర్శన చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందచేశారు.

మార్కాపురంలో భారీ ప్రదర్శన
మార్కాపురం పట్టణం, కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: అన్ని రంగాల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా చేయాలంటూ సోమవారం విద్యార్థులు, స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు కందుకూరు రెవెన్యూ డివిజన్‌ను నెల్లూరు జిల్లాలో కలపొద్దంటూ ఉలవపాడు మండలం కరేడుకు చెందిన యాదవ ఐకాస జిల్లా అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

మండలాలు మార్చాలని ఎమ్మెల్యేల వినతి..

కాకినాడ కలెక్టరేట్‌, రంపచోడవరం, పెందుర్తి, పాడేరు, అరకులోయ, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని కోరుతూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర కాకినాడ కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు వినతిపత్రం అందజేశారు. పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి దంపతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రంపచోడవరాన్ని ప్రత్యేక ఆదివాసీ జిల్లాగా ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పల్లాల లచ్చిరెడ్డి, కుంజా దూలయ్య తదితరులు ఐటీడీఏ ముట్టడి చేపట్టారు.

పెందుర్తిని ‘విశాఖ’లోనే కొనసాగించాలి...

పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కాకుండా విశాఖ జిల్లాలోనే కొనసాగించాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కోరారు. ఈమేరకు సోమవారం సుజాతనగర్‌లో సీపీఐ, భాజపా, కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:కొత్త వేతన స్కేలు అమలు... ఉద్యోగుల చరవాణికి సమాచారం

Last Updated : Feb 1, 2022, 4:43 AM IST

ABOUT THE AUTHOR

...view details