ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Missing Woman Came Home: 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మహిళ.. ఇంటికి చేరిన వేళ..!

Missing Woman Came Home: 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మహిళ ఇన్నాళ్లకు క్షేమంగా తన స్వగ్రామానికి చేరుకుంది. ఈ అరుదైన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇంటి బిడ్డ తిరిగి రావటంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. అసలేం జరిగిందంటే..?

By

Published : May 16, 2023, 2:19 PM IST

Missing Woman Came Home
పాతికేళ్ల క్రితం తప్పిపోయిన మహిళ పద్మమ్మ

Missing Woman Came Home: చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మహిళ.. ఇన్నాళ్లకు తన ఇంటిని చేరుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలోని శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో మునియప్ప, కన్నమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వారిలో కుమార్తె పద్మమ్మ పెద్దది. పద్మమ్మ ఆ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆమెను సుమారు 30 ఏళ్ల కిందట కర్ణాటక పరిధిలోని కీరమంద గ్రామంలో వెంకటేష్​కు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వారి దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా సాగింది. వారికి ఇద్దరు కుమారులు.

అయితే కొన్నాళ్లకు పద్మమ్మ మతిస్థిమితం సరిగా లేక ఎక్కడికో వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం పలు చోట్ల గాలించినా ఫలితం లేకపోయింది. 25 సంవత్సరాలుగా ఆమె ఆచూకీ లభించలేదు. ఒక్కగానొక్క కుమార్తె పద్మమ్మ తప్పిపోవటంతో ఆమె తల్లి కన్నమ్మ బెంగపెట్టుకుని.. 20 ఏళ్లు వేదన అనుభవించి.. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. కాగా.. పద్మమ్మ విజయవాడలో ఉన్నట్లు ఐదు రోజుల కిందట ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విజయవాడలో లక్ష్మి అనే మహిళ సంరక్షణలో ఉన్న పద్మమ్మకు ఓ ప్రమాదంలో తలకు గాయం అయింది.

దీంతో ఆమెను చికిత్స మేరకు సమీపంలోని ఓ హాస్పిటల్​కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ఆరోగ్యం కుదుటపడి గతం గుర్తుకు వచ్చింది. దీంతో తన తల్లిదండ్రుల పేర్లు, స్వస్థలం తదితర వివరాలను హాస్పిటల్ సిబ్బంది, సంరక్షకురాలికి పద్మమ్మ చెప్పింది. వెంటనే వారు అక్కడి వార్డు సచివాలయ సిబ్బంది సాహకారంతో రాళ్లబూదుగూరు గ్రామ సచివాలయ సంక్షేమ కార్యదర్శికి విషయాన్ని తెలిపారు. స్థానిక ఏఎన్‌ఎం హైమావతి అక్కడికి ఇంటికి వెళ్లి రూఢీ చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులను విజయవాడకు పంపించారు.

పద్మమ్మ ఆచూకీని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం విజయవాడ హాస్పిటల్​కు వెళ్లారు. అక్కడి నుంచి ఆమెను తమ స్వగ్రామానికి తీసుకుని వచ్చారు. 25 ఏళ్ల తర్వాత పద్మమ్మ తిరిగి రావటంతో తమ ఆనందానికి అవధులు లేవంటూ ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇన్నేళ్లకు ఇంటికి చేరిన పద్మమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. పద్మమ్మకు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా ఆమెను హాస్పిటల్​లో చేర్పిస్తామని అన్నారు. 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన పద్మమ్మ ఇలా సజీవంగా ఇంచికి చేరుకోవటం పట్ల ఆమె కుటుంబ సభ్యులు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోని వారందరినీ గుర్తు పడుతోందని చెప్పారు.

"అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు పద్మమ్మకు సుమారు 30 ఏళ్ల క్రితం వివాహం చేశాము. ఆమెకు ఇద్దరు కుమారులు. అయితే ఆమెకు మతిస్థిమితం సరిగా లేక 25 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ బాధతో నా భార్య నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఇన్నాళ్లకు నా కూతురు ఇంటికి క్షేమంగా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది." - మునియప్ప, పద్మమ్మ తండ్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details