ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 6, 2020, 4:22 PM IST

Updated : Jun 6, 2020, 4:54 PM IST

ETV Bharat / state

యువసైన్యం.. అన్నార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యం..!

ఏ ఒక్కరూ పస్తులుండకూడదన్న ఉద్దేశంతో అన్నదానం చేసే స్వచ్ఛంద సేవకులు చాలా మందే ఉంటారు. ఒక్కపూట భోజనం దొరికితే చాలు... రోజు గడుస్తుందని ఎదురుచూసే అన్నార్థులూ కోకొల్లలు. అయితే... కొన్నిచోట్ల దాతలు పంచే ఆహారం వృథా అవుతుండడం ఎంత నిజమో... అన్నం దొరక్క ఎంతో మంది ఖాళీ కడుపుతో పడుకోవడమూ.. అంతే నిజం. ఈ సమస్య పరిష్కరిస్తున్నారు అనంతపురం యువత. అర్హులకు, దాతలకు మధ్య వారధిగా నిలుస్తూ రోజూ వేలాదిమంది పేదల ఆకలి తీరుస్తున్నారు.

యువసైన్యం.. అన్నార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యం..!
యువసైన్యం.. అన్నార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యం..!

అన్నార్థుల ఆకలి తీరుస్తోన్న యువసైన్యం

వారంతా ప్రైవేట్‌గా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పేద యువకులే. ఆకలి బాధ తెలిసి పెరిగిన వారు. వాళ్లందరినీ కలిపింది మాత్రం తమలాంటి నిరుపేదల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన, సేవా భావన. ఎవరికివారు వేర్వేరుగా 5 స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపి.. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సహృదయ సేవా సమితి వ్యవస్థాపకుడు బాలకృష్ణ ఈ ఐదు సంస్థలకు చెందిన యువకులందరినీ ఏకతాటిపైకి తెచ్చాడు.

జనతా కర్ఫ్యూ నుంచే

బాలకృష్ణది నూనెమిల్లులో చిరుద్యోగం. తనకొచ్చే తక్కువ వేతనంలోనుంచే రాత్రిళ్లు బస్టాండ్లు, రైల్వేస్టేషన్, రోడ్లపై ఆకలితో బాధపడే పేదలకు ఆహారం అందించేవాడు. పెళ్లిళ్లు ఇతర వేడుకల్లో మిగిలిపోయిన ఆహారం తీసుకెళ్లి వారి ఆకలి తీర్చేవాడు. లాక్‌డౌన్ వల్ల మిల్లు మూతపడడం వల్ల... పూర్తిస్థాయిలో పేదల కోసమే పనిచేయడం మొదలుపెట్టాడు. జనతా కర్ఫ్యూ మొదలైన రోజు నుంచి... దాతల సహాయంతో నిత్యావసరాల పంపిణీ, ఆహారం సరఫరా కొనసాగిస్తున్నాడు.

అభాగ్యులకు అండగా

సహృదయ సేవాసమితి గురించి తెలిసి, మరో 4సేవాసంస్థల్లోని యువకులు బాలకృష్ణతో చేతులు కలిపారు. ఆదరణ సేవా సమాజ్, ఫ్రెండ్స్ సొసైటీ, రెడ్ డ్రాప్స్, గ్లోబల్ సోషల్ కాప్స్ ఫర్ పీపుల్ ఆర్గనైజేషన్ సంస్థలు కలిసి, యువ సైన్యంగా మారాయి. వీళ్లంతా లాక్‌డౌన్‌లో పేదలకు, అభాగ్యులకు అండగా నిలిచారు. నిత్యావసరాల పంపిణీ, వృద్ధులు, ఆసుపత్రుల్లోని రోగులు, వారి బంధువులకు మూడుపూటలా భోజనం అందిస్తున్నారు.

పోలీసుల అభినందన

అనంతపురంలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేసిన పోలీసులు సైతం.. ఈ యువకుల సేవలు కొనియాడారు. వారిని ఎక్కడా అడ్డుకోకుండా సహకరించారు. రక్తదానంపై పనిచేస్తున్న రెడ్ డ్రాప్స్ సంస్థ, అన్నదానంలో పాలుపంచుకుంటూనే, ఆసుపత్రుల్లో అత్యవసరమైన వారికి కావల్సిన రక్తం అందించడంలో చురుగ్గా పాల్గొన్నారు. బెంగళూరు నుంచి జాతీయ రహదారిమీదుగా వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్లే వలస కూలీల ఆకలితీర్చి.. అధికారుల ప్రశంసలు అందుకున్నారు. వలసకూలీల కోసం 24 గంటలూ నిత్యాన్నదాన శిబిరం నిర్వహించారు.

ఈ ఐదు స్వచ్ఛంద సంస్థల్లోని 30 మంది యువకుల సిద్ధాంతాలు వేరైనప్పటికీ.. అందరి లక్ష్యం ఒక్కటే కావటంతో నిరుపేదల ఆకలి తీరుతోంది. వందలాది మంది అభాగ్యుల అవసరాలకు అండగా నిలిచిన ఈ యువకులంతా నేటి తరానికి ఆదర్శం.

ఇదీ చూడండి..

మేము వ్యాపారం ఎలా చేసుకోవాలో మీరే చెప్పండి సార్​..!

Last Updated : Jun 6, 2020, 4:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details