ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 12, 2021, 1:29 PM IST

ETV Bharat / crime

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం నుంచి దా'రుణాల'కు డైరెక్టరై..

రుణ యాప్‌ల ఆగడాలపై పోలీసులు మూలాల్లోకి వెళ్లి ఆరా తీస్తున్నప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరంపరలోనే బీటెక్‌ పూర్తిచేసి.. 9 రుణ కంపెనీలకు డైరెక్టరైన చిన్నబ్బ రాజశేఖర్‌ అరెస్ట్‌.. ఈ యాప్‌లకు సంబంధించిన రూ.300 కోట్లు స్తంభింపజేయడం చోటు చేసుకున్నాయి.

CRIME
CRIME

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దా‘రుణాల’పై ఓ కన్నేసి ఉంచడంతో స్నాపిట్‌.. ఓకే కాష్‌ కాష్‌బీ, రూపీ ఫ్యాక్టరీ బబుల్‌లోన్‌, గోక్యాష్‌ పేర్లతో రుణాలిస్తాం అంటూ అంతర్జాలంలో ప్రకటనలు కనిపించాయి. ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ వీటి చిరునామాలు, ఆర్థిక లావాదేవీలు పరిశీలించారు. ఆ యాప్‌లు నిర్వహిస్తున్న చైనా సంస్థల బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.300 కోట్ల నగదును స్తంభింపజేశారు. తాము అరెస్ట్‌ చేసిన చైనీయుడు ల్యాంబో, కె.నాగరాజులు వీటిని ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్నారు.

తవ్విన కొద్దీ...

పోలీసులు మరింత లోతుగా పరిశోధించగా, బెంగళూరులో తొమ్మిది కంపెనీలు ఉన్నాయని తెలిసింది. ఈ సమాచారంతో ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ బృందం బుధవారం రాత్రి అక్కడికి వెళ్లింది. మణిపాల్‌ సెంటర్‌ ప్రాంతంలో ఎఫ్‌668 టెక్నాలజీస్‌ పేరుతో తొమ్మిది చైనా కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న చిన్నబ్బ రాజశేఖర్‌ను గురువారం తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు. అతడిని అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి జైలుకు తరలించామని ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ తెలిపారు.

రాజశేఖర్‌ చిత్తూరు జిల్లా వాసి

బెంగళూరులో తొమ్మిది కంపెనీలకు బాధ్యుడిగా ఎవరినైనా నియమించాలని చైనీయుడు లియో కోరగా.. నాగరాజు బెంగళూరులో తనకు తెలిసిన వారిద్వారా ప్రయత్నించాడు.. వారు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న చిన్నబ్బ రాజశేఖర్‌ పేరు చెప్పారు. చిత్తూరు జిల్లా పాచిగుంట గ్రామానికి చెందిన రాజశేఖర్‌ ఆరేళ్ల క్రితం బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చాడని, ప్రస్తుతం ఎఫ్‌668 టెక్నాలజీస్‌లో పనిచేస్తున్నాడని వివరించారు. అనంతరం నాగరాజు, రాజశేఖర్‌ను కలిసి యాప్‌ల ద్వారా రుణాలివ్వడం, వసూలు చేసుకోవడం ద్వారా రూ.లక్షల్లో ఆదాయం వస్తుందని చెప్పాడు. సరేనన్న రాజశేఖర్‌ తొమ్మిది కంపెనీలకు డైరెక్టర్‌ అయ్యాడు. గతేడాది మార్చి నుంచి తన కంపెనీలు ప్రత్యేకంగా తయారుచేసిన యాప్‌ల ద్వారా రుణాలివ్వడం మొదలు పెట్టాడు. రుణాల యాప్‌ కేసుల్లో ఇప్పటి వరకూ 21 మందిని అరెస్ట్‌ చేశామని, రూ.300 కోట్లు సీజ్‌ చేశామని సంయుక్త కమిషనర్‌ (నేర పరిశోధన) అవినాష్‌ మహంతి తెలిపారు.

రూ.వేల కోట్లు దండుకోవాలన్న లక్ష్యంతో..

పూచీకత్తు లేకుండా రుణాలిచ్చి రూ.వేల కోట్లు దండుకోవాలన్న లక్ష్యంతో చైనా దేశస్థురాలు జెన్నిఫర్‌ దిల్లీలో నాలుగు సంస్థలు ప్రారంభించింది. వీటికి అనుబంధంగా బెంగళూరు, హైదరాబాద్‌, దిల్లీలో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతను చైనీయుడు ల్యాంబో, కర్నూలు జిల్లావాసి నాగరాజుకు అప్పగించి ఆమె గతేడాది ఫిబ్రవరిలో జకార్తా వెళ్లిపోయింది. నాలుగు సంస్థల తరహాలో లియో అనే చైనా దేశస్థుడు బెంగళూరులో కొత్త సంస్థను ప్రారంభించాలనుకున్నాడు. ల్యాంబోను సంప్రదించగా.. యున్‌వుయ్‌ టెక్నాలజీస్‌, సాట్‌టైమ్‌, ప్రెగ్లా ఫిన్‌టెక్‌ వంటి తొమ్మిది కంపెనీలను బెంగుళూరులో ఏర్పాటు చేశాడు.

ఇవీ చూడండి: మైనర్​పై 6 నెలలుగా ఏడుగురి అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details