ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొవిడ్ ఎఫెక్ట్.. మానసిక ఆందోళనకు గురవుతున్న ఖైదీలు

By

Published : Nov 1, 2020, 10:41 PM IST

కొవిడ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కారాగారాల్లో మగ్గుతున్న ఖైదీలు ఏడు నెలలుగా కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం లేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను క్రమంగా సడలిస్తున్నప్పటికీ కారాగారాల్లో ఖైదీలను కలుసుకునే అవకాశం ఎప్పటినుంచి మొదలవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. కొవిడ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ నెల నుంచి ములాఖత్‌లు నిలిపివేశారు. శిక్షపడ్డ ఖైదీలకు ప్రతి 14 రోజులకు రెండుసార్లు వారికి తెలిసిన వారితో ములాఖత్‌కు అవకాశం కల్పిస్తారు. ఒక్కో ములాఖత్‌లో ముగ్గురు ఆ ఖైదీతో మాట్లాడవచ్చు. రిమాండు ఖైదీలను వారానికి రెండుసార్లు కలుసుకునే సదుపాయం ఉంటుంది. గత ఏడునెలలుగా ఖైదీలకు ఆ సదుపాయం లేకపోవడంతో పలువురు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

No Mukhath in Prisons due to Covid-19
కొవిడ్ ఎఫెక్ట్.. మానసిక ఆందోళనకు గురవుతున్న ఖైదీలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్ర, జిల్లా, ఉప, ప్రత్యేక కారాగారాల్లో సుమారు ఆరువేల మంది వరకు ఉన్నట్లు అంచనా. వారిని కలుసుకోవడానికి నిత్యం వందల మంది వస్తుంటారు. ఖైదీలకు ములాఖత్‌లను అత్యంత అమూల్యమైన విషయంగా పరిగణిస్తుంటారు. సొంతవారు, స్నేహితులు కలిసినప్పుడు వారి గుండెల్లో ఆవేదన అంతా వెళ్లబోసుకుని ఒకింత ఉపశమనం పొందుతారు. సొంతవాళ్లకు దూరమయ్యామన్న బాధ నుంచి స్వాంతన పొందుతారు. ఖైదీలు మానసికంగా కుంగిపోకుండా, ఆరోగ్యంగా ఉండడానికి ములాఖత్‌లు కీలకంగా ఉంటాయి. అలాంటి కీలకమైన ములాఖత్‌లు నిలిచిపోవడం ఖైదీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. కారాగారాల్లో ఉన్నవారిని చూసే అవకాశం లేక వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

నగదు అందక ఇబ్బంది...
ఖైదీలను చూడడానికి వచ్చినప్పుడు వారి బంధువులు ఎంతోకొంత నగదు ఇచ్చి వెళ్తుంటారు. ప్రతిఖైదీకి కారాగారాల్లో పి.పి.సి.(ప్రిజనర్స్‌ ప్రైవేట్‌ క్యాష్‌) మొత్తాలను జైలు అధికారులే నిర్వహిస్తుంటారు. ఆ మొత్తంతో ఖైదీలు వారికి అవసరమైనప్పుడు కారాగారాల్లోపలి క్యాంటీన్లలో దొరికే ఆహారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ములాఖత్‌లు నిలిచిపోయిన నేపథ్యంలో చాలామంది ఖైదీల పి.పి.సి. మొత్తాలు ఖాళీ అయ్యాయని, అధికారులు పెట్టే ఆహారం తప్ప సొంతంగా కొనుగోలు చేయడానికి అవకాశాలు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారాగారాలకు ఖైదీల బంధువులు మనీఆర్డర్‌ (ఎం.ఒ) చేయవచ్చు. కానీ చాలామందికి ఆవిషయం తెలియకపోవడంతో ఎం.ఒ పంపేవాళ్లు కూడా చాలా తక్కువమందే ఉంటున్నారని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

విశాఖ కేంద్ర కారాగారంలో...
విశాఖలోని కేంద్రకారాగారంలో సుమారు 1500 మంది ఖైదీలున్నారు. వారిలో శిక్షపడ్డవారు 700 ఖైదీలుండగా మిగిలినవారు కారాగారంలో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నవారే. వారిలో లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 68 మంది కొవిడ్‌ బారిన పడగా ఒకరు చనిపోయారు.

ఇదీ చదవండీ... ప్రభుత్వ ఉదాసీనతే పోలవరానికి శాపం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details