మోసగాళ్లకు మోసగాడు.. విశాఖ పోలీసుల చేతికి చిక్కాడు
అనిశా కేసుల్లో ఇరుక్కున్న ఉద్యోగులనే బురిడీ కొట్టించాడు.. ఓ వ్యక్తి. వారి నుంచే సొమ్ము కాజేసి.. మోసగాళ్లకు మోసగాడిగా ఎదిగాడు. తెలంగాణలోని కరీంనగర్ నుంచి దందా మొదలు పెట్టి.. చివరికి విశాఖ పోలీసుల చేతికి చిక్కాడు.
తెలంగాణలోని కరీంనగర్కు చెందిన సురేశ్ కుమార్.... మోసాలు చేయడంలో దిట్ట. ఎవరినైనా అవలీలగా దగా చేసేస్తాడు. అనిశా కేసుల్లో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులపైనా.. తన తెలివి చూపించుకున్నాడు. జాగ్రత్తగా.. వల వేశాడు. సచివాలయంలో పనిచేస్తున్నట్టుగా వారిని నమ్మించాడు. కేసుల్లో ఇబ్బందులు రాకుండా.. ఉద్యోగులకు అనుకూలంగా నివేదికలు వచ్చేలా చూస్తానంటూ నమ్మబలికాడు. ఇలా 11 మంది ఉద్యోగుల వద్ద డబ్బు వసూలు చేశాడు. అదోక్కటే కాదు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ మరో 10 మందిని బురిడీ కొట్టించాడు. అలా 2 రాష్ట్రాల్లో సుమారు రూ.28 లక్షలకు పైగా సొమ్ము చేసుకున్నాడీ మోసగాళ్లకు మోసగాడు. విశాఖకు చెందిన ఓ బాధిత మహిళ ఫిర్యాదుతో సురేశ్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. కటకటాలపాలయ్యేలా చేశాయి.