ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బ్యాలెట్‌ బాక్సులు!

తెలంగాణలోని రెండు శాసనమండలి స్థానాల ఎన్నికలకు దశాబ్దం క్రితం తయారు చేయించిన భారీ బ్యాలెట్‌ బాక్సులను వినియోగించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. మండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు వచ్చే నెల 14న పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రాధాన్యత ప్రాతిపదికన ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

By

Published : Feb 28, 2021, 1:42 PM IST

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బ్యాలెట్‌ బాక్సులు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బ్యాలెట్‌ బాక్సులు

తెలంగాణలోని రెండు శాసనమండలి స్థానాల ఎన్నికల పోలింగ్​లో పదేళ్ల క్రితం తయారు చేయించిన బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఈవీఎం యంత్రాల వినియోగానికి అవకాశం లేనందున, బ్యాలెట్‌ పత్రంతోనే పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గంలో 93 మంది (గతంలో ఇక్కడ అత్యధికంగా 57 మంది పోటీ చేశారు), వరంగల్‌- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో దినపత్రిక సైజులో బ్యాలెట్‌ పత్రాన్ని రూపొందించాల్సిన పరిస్థితి. బ్యాలెట్‌ బాక్సులు కూడా అదే స్థాయిలో ఉండాలి. ఈ క్రమంలో గతంలో వినియోగించిన జంబో బాక్సులను వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.

2010లో 5 నియోజకవర్గాల్లో...

2010 ఉపఎన్నికల సమయంలో తెరాస పార్టీ ఈవీఎంలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోరుట్ల, ఎల్లారెడ్డి, సిరిసిల్ల, హుజూరాబాద్‌, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాల్లో 64 కన్నా ఎక్కువ మందిని బరిలో నిలిపింది. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 78 మంది అభ్యర్థులను పోటీకి దింపింది. అప్పట్లో వినియోగించిన ఈవీఎంలను 64 మందిలోపు పోటీలో ఉంటేనే వినియోగించేందుకు అవకాశం ఉంది.

అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ అయిదు నియోజకవర్గాల్లో ఈవీఎంలు వినియోగించే అవకాశం లేక భారీ బ్యాలెట్‌ బాక్సులను అప్పటి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఐ.వి.సుబ్బారావు తయారు చేయించి వినియోగించారు. అంతకుముందు 1996లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో 480 మంది పోటీ చేయడంతో భారీ సైజు బ్యాలెట్‌ బాక్స్‌లను తయారు చేశారు. వాటిని కూడా తాజాగా వినియోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

3,400 బ్యాలెట్‌ బాక్సులు అవసరం

తాజాగా మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గంలో 799, వరంగల్‌- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గంలో 731 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో రెండు చొప్పున బ్యాలెట్‌ బాక్సులను ఏర్పాటు చేయటంతోపాటు అదనంగా కొన్నింటిని అందుబాటులో ఉంచనున్నారు. ఇలా మొత్తంగా 3,400 బ్యాలెట్‌ బాక్స్‌లు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. 2010లో తయారు చేసిన బ్యాలెట్‌ బాక్స్‌లు ఎన్ని ఉన్నాయన్నది నిర్ధారించుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అవి సరిపోని పక్షంలో 1996లో తయారు చేసిన వాటిని వినియోగించాలని యోచిస్తున్నారు. అప్పటి బాక్సుల వినియోగానికి అనుమతి కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అనుమతి రాగానే వినియోగానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి:

ఆంధ్రా అరటికి విదేశాల్లో డిమాండ్‌: ఉద్యానవన శాఖ కమిషనర్

ABOUT THE AUTHOR

...view details