ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బతికున్నోడిని చంపేశారు.. చనిపోయినోడిని పట్టించుకోవట్లేదు..!

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఓవైపు షాదిముబారక్‌, కళ్యాణలక్ష్మి అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తుంటే... మరోవైపు వ్యవసాయశాఖ పరిధిలోని రైతుబంధు, రైతు బీమాలో అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. బతికున్న రైతును చనిపోయినట్లు నమోదు చేయడం వల్ల ఒకరికి రైతుబంధు ఆగిపోతే.. చనిపోయినా మరో రైతుకు రైతుబీమా అందని వైనం బయటపడింది. బాధితులు గోస పెట్టుకున్నా స్పందించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

By

Published : Nov 21, 2020, 5:51 PM IST

Published : Nov 21, 2020, 5:51 PM IST

rythu-Bheema in Telangana state
బతికున్నోడిని చంపేశారు.. చనిపోయినోడిని పట్టించుకోవట్లేదు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా, రైతు బందు పథకాల అమలు... రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లాలో లెక్కతప్పుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల రైతు సంక్షేమం గాడితప్పుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 99 వేల 909 మంది రైతులు రైతు బీమా చేయించుకోగా.. ఇప్పటిదాకా 106 మంది రైతులు చనిపోయినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిక వెల్లడిస్తోంది. చనిపోయిన రైతుల్లో కేవలం 73 కుటుంబాలకే 5లక్షల రూపాయల చొప్పున బీమా పరిహారం అందింది. మిగిలిన దరఖాస్తులను ఎటూ తేల్చకపోవడం వల్ల బాధిత రైతు కుటుంబాల్లో ఆవేదన గూడుకట్టుకుంటోంది.

చనిపోయిన ఏడాది గడుస్తున్నా...

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం వాన్‌వట్‌ గ్రామానికి చెందిన మరప రవి ఏడాదిగా రైతుబీమా కోసం ఎదురుచూస్తున్నా అధికారులు కనికరించడం లేదు. ఎకరంన్నర పొలం కలిగిన రవి తండ్రి నాగోరావు 2019 నబంబర్‌ 17 అనారోగ్యంతో మరణించారు. అన్ని ధ్రువపత్రాలతో బీమా కోసం రవి దరఖాస్తు చేశాడు. ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

నువ్వు చనిపోయావు కదా...

వ్యవసాయాధికారుల నిర్లక్ష్యానికి మరో ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. సిరికొండ మండలం రాంపూర్‌ గ్రామానికి అంజనాబాయికి ఒక ఎకరం 31 గుంటల భూమి ఉంది. వానాకాలం పంటకు రైతుబంధు రాకపోవడం వల్ల.. ఏమైందని ఆరాతీసిన రైతుకు అధికారులు కంగు తినే సమాధానమిచ్చారు. "నువ్వు చనిపోయావు" అని చెప్పగా.. బతికే ఉన్నానంటూ గోడు వెళ్లబోసుకుంటున్నా.. అధికారులు స్పందించడంలేదు.

జిల్లాస్థాయిలో ఎప్పటికప్పుడు రైతు బంధు, రైతు బీమా పథకం అమలు తీరుపై ఉన్నతాధికారులు సమగ్ర సమీక్షలు నిర్వహించకపోవడం వనే తప్పులు దొర్లుతున్నాయని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి:

'ప్రతి పథకాన్ని మత్స్యకారులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details