ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 28, 2020, 6:17 PM IST

ETV Bharat / city

'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

నివర్ తుపాను రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. లక్షల హెక్టార్లలో పంట నీట ముంచి అన్నదాతల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. రాష్ట్రవ్యాపంగా పంట నష్టపోయిన రైతులను అధికార ప్రతిపక్ష నేతలు, అధికారులు పరామర్శించారు. పంట నష్టం అంచానా వేసి ప్రభుత్వం తరఫున పరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'
'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

నెల్లూరు

జిల్లాలోని ఆత్మకూరు, అనంతసాగరం, ఎయస్​.పేట, సంగం మండలాల్లో మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటించారు. నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలు, ముంపు ప్రాంతాలను సందర్శించారు. నాగుల వెల్లటూరు చెరువుకు పడిన గండిని పరిశీలించారు. యుద్ధ పాత్రిపదకన గండిని పూడ్చాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామం జల దిగ్భందంలో చిక్కుకోవటంతో నాటు పడవలో వెళ్లి గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు.

'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

చిత్తూరు

నివర్ తుపాను వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా అధికారులు ప్రశంసనీయమైన కృషి చేశారని వైకాపా ఎమ్మెల్యే రోజా అభినందించారు. నగరిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాలంటీర్లు కరోనా సమయంలోనూ, ప్రస్తుత తుపాను సమయంలోను ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. నివర్ తుపాను బాధితులను ఆర్థికంగా ఆదుకోవడానికి డిసెంబరు 15 లోగా అంచనాలు సిద్ధం చేసి డిసెంబరు 31 నాటికి పరిహారం చెల్లించేలా సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. నగరి నియోజకవర్గంలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువులు, కాలువల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.

'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

గుంటూరు

వేమూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు పర్యటించారు. నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నివర్ తుపాను రైతులకు తీరని నష్టం మిగిల్చిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వాపోయారు. పొన్నూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన... పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. గత మూడు రోజులుగా పంటలు నీళ్లల్లో నానుతున్నా... అధికారులు పట్టించుకోకపోవటం దారుణమన్నారు.

నివర్‌ తుపాను కారణంగా లక్షల హెక్టార్లలో పంట నీట మునిగి రైతులు గగ్గోలు పెడుతుంటే... ప్రభుత్వం మీనమేషాలు లెక్కించటం పట్ల మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. తుపాను ధాటికి రైతులు, ప్రజలు అల్లాడుతుంటే.. ఇళ్లల్లో కూర్చొని కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే... తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బాపట్ల మండలంలో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. జిల్లాలో లక్ష 20 వేల హెక్టార్లలో నష్టాన్ని అంచనా వేశామని... నివేదికను త్వరలోనే కలెక్టర్​కు అందజేస్తామని ఆయన తెలిపారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు.

'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

ప్రకాశం

కంభం మండలంలోని పలు గ్రామాల్లో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు పర్యటించారు. నివర్ తుపాను కారణంగా నెలకొరిగిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు తగిన పరిహారమిచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారీ వర్షం కారణంగా నిండుకుండలా మారి అలుగుపోస్తున్న మార్కాపురం చెరువును ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి సందర్శించారు. నీటి ప్రవాహ ఉద్ధృతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు కట్టను అనుకొని నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పంట ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే అన్నారాంబాబు పర్యటన

కృష్ణా

తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజయవాడ తేదేపా పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య డిమాండ్ చేశారు. పెనుగంచిప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన నేతలు నీటమునిగిన పంటలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి షరతులు లేకుండా పూర్తి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పంటలను పరిశీలిస్తున్న తెదేపా నేత నెట్టెం రఘురాం

తూర్పు గోదావరి

ప్రత్తిపాడు నియోజకవర్గలో నీట మునిగిన పంటలను తెదేపా నేత వరుపుల రాజా పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతులతో మాట్లాడుతున్న తెదేపా నేత వరుపుల రాజా

కడప

నివర్ తుపాను కారణంగా కమలాపురం నియోజక వర్గంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటనష్టపోయిన రైతులను తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహ రెడ్డి పరామర్శించారు. బాధిత రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పంట నష్టం వివరాలను కలెక్టర్ హరి కిరణ్, వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

ఇదీ చదవండి:

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్‌ సర్వే

ABOUT THE AUTHOR

...view details