వర్షాలతో మరో రెండ్రోజులు రాత్రివేళ కనుమ రహదారులు మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం ఉ. 4గంటల వరకు మళ్లీ శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం ఉ. 4 గంటల వరకు వాహనాలు అనుమతించమని వెల్లడించింది. భక్తులు సహకరించాలని కోరింది. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో గురువారం రాత్రి కూడా అధికారులు కనుమదారులు మూసివేశారు.
కొండపై వర్షాలు..
తిరుమల కొండపై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం (heavy rains in tirumala) కురిసింది. భారీ వర్షానికి అలిపిరి నడక మార్గంలో వరద ప్రమాదకరంగా ప్రవాహించింది. ఎంతగా అంటే.. కొండపైకి నడిచి వెళ్లే భక్తులు.. ఆ ప్రవాహం ధాటికి కొట్టుకుపోయో పరిస్థితి తలెత్తింది. దీంతో.. భయాందోళనకు గురైన భక్తులు.. మెట్ల మార్గానికి పక్కనున్న పిట్టగోడపైకి ఎక్కి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లారు.
గాలివాన తీవ్రతకు నడకమార్గంతోపాటు కనుమ దారుల్లో పదుల సంఖ్యలో చెట్లు కుప్పకూలాయి. గాలిగోపురం వద్ద చెట్టు పడిపోవడంతో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి(shops destroyed). భారీగా వీచిన గాలులకు దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలోనూ భారీ వృక్షాలు కూలిపోయాయి. కనుమదారుల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లను తితిదే సిబ్బంది తొలగిస్తోంది. ముందుజాగ్రత్తగా పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తితిదే తాత్కాలికంగా మూసివేసింది. తీర్థాల వద్ద భారీ ప్రవాహంతో భక్తుల సందర్శన నిలిపివేశారు. జీఎన్సీ విచారణ కార్యాలయం, ఎంబీసీ వద్ద ఉన్న జలప్రసాదం కేంద్రంపై చెట్టు పడింది. ఈ సమయంలో అక్కడ భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
నిండుకుండలా జలాశయాలు...
అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వానతో తిరుమల జలాశయాల్లోకి(dams at tirumala) పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. పాపవినాశనం(papavinashanam), గోగర్బం జలాశయాల(gogarbham dam) గేట్లు ఎత్తి నీటికి కిందికి వదులుతున్నారు. జంట జలాశయాలైన కుమారధార, పసుపుధార నిండుకుండను తలపిస్తున్నాయి. తిరుమలలో ఎడతెరిపి లేని వర్షాలతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు, దర్శనం చేసుకున్నవారు తిరిగి గదులకు చేరుకునేందుకు వానలో తడుస్తూ అవస్థలు పడాల్సి వస్తోంది. తిరుమాడ వీధుల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. ఈదురుగాలులకు చెట్లు, కొమ్మలు విరిగి పడుతుండటం వల్ల బ్రాడ్కాస్టింగ్ ద్వారా యాత్రికులను అప్రమత్తం చేశారు.
లోతట్లు ప్రాంతాలు జలమయం...
వాన ధాటికి తిరుపతి నగర వీధులన్నీ నీటితో నిండిపోయాయి. మురికివాడలు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఇళ్లలోకి మురుగునీరు రావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధురా నగర్, వెస్ట్ చర్చ్, లక్ష్మీపురం కూడలి ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధుల్లో నడుముల్లోతుకు పైగా నీళ్లు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ఈదురుగాలుల దెబ్బకు కొన్నిచోట్ల చెట్లు నేలకొరిగాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో స్వర్ణముఖినది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏర్పేడు మండలం మోదుగులపాలెం సమీపంలోని కాజ్వేపై వరద ప్రవహిస్తోంది. నగరి, పుత్తూరు, నేసనూరు, పిళ్లారిపట్టు, గోపాలకృష్ణాపురంలో వాగులు, వంకలు జోరుమీదున్నాయి.
నిలిచిన రాకపోకలు...
చంద్రగిరి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి, మామిడిమానుగడ్డ, కొట్టాల, పులిత్తివారిపల్లెలో రోడ్లు కోతకు గురయ్యాయి. పలు గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. భీమవరం నుంచి కొత్తపేట వెళ్లే రోడ్డు కొన్నిచోట్ల కొట్టుకుపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. మూలపల్లి, కొండ్రెడ్డి చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. గంగాధరనెల్లూరు పరిధిలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పెనుమూరు మండలంలో ఎన్టీఆర్ జలాశయం నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో... నీవా నది పరవళ్లు తొక్కుతోంది. పాతపాళ్యం, పాపిరెడ్డిపల్లె వాగులు పొంగడంతో... సమీప గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.
ఇదీ చదవండి:NARA LOKESH TOUR: అందుకోసమే.. సైకిల్కు ఓటేయండి : నారా లోకేశ్