ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 29, 2022, 10:48 AM IST

ETV Bharat / city

రుణ యాప్‌ల ఆగడాలు.. ఉసురు తీసుకుంటున్న బాధితులు

LOAN APPS HARASSMENTS: ఆకర్షణీయ ప్రకటనలిస్తారు.. హామీ అవసరమే లేదు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని.. వివరాలు ఇవ్వడమే ఆలస్యం.. అర క్షణంలో అడిగినంత రుణం... ఖాతాలో జమైపోతుంది. ఇదీ ఆన్‌లైన్‌ ఆధారిత రుణయాప్‌లు ఊరిస్తూ ఉచ్చులోకి లాగుతున్న తీరు. అందులో చిక్కుకుని వేల మంది బాధితులు అల్లాడుతున్నారు. ఇచ్చే సమయంలో లాలిస్తున్న యాప్‌ నిర్వాహకులు.. రుణం చెల్లించటం ఒక్క రోజు ఆలస్యం అయినా బెదిరింపులు, వేధింపులకు దిగుతున్నారు. చివరకు రుణగ్రహీతల పరువు తీసి.. ఆపై ఉసురు తీసుకునే దారుణ పరిస్థితులు కల్పిస్తున్నారు.

LOAN APPS
LOAN APPS

లాక్‌డౌన్‌.. కరోనా ప్రభావం, పెరిగిన ఖర్చులు... మరోవైపు ఆదాయాలు తగ్గటం.. ఆ కాస్త మొత్తంతో కుటుంబాన్ని నెట్టుకురావటం కత్తిమీద సామే అవుతోంది. దీంతో చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని యాప్‌ నిర్వాహకులు ఆసరాగా తీసుకుంటున్నారు. చరవాణిలో అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ లోన్‌ యాప్‌లు కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఈ రుణాలు పొందడానికి వస్తువులు తనఖా పెట్టాల్సిన అవసరం కానీ.. హామీలు ఇవ్వాల్సిన పని లేదు. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే ఆయుధంగా వినియోగిస్తున్నారు. నిరుపేదల అవసరాన్ని ఆసరాగా తీసుకొని అధిక వడ్డీలు వేసి ముప్పుతిప్పలు పెడుతున్నారు.

క్లిక్‌ చేస్తే అంతే...:రుణ యాప్‌పై క్లిక్‌ చేసినా, డౌన్‌లోడ్‌ చేసినా వారి ఉచ్చులో చిక్కినట్లే. అప్పు తీసుకునే వ్యక్తి ఫోన్‌లో కాంటాక్ట్‌ నంబర్లు, చిత్రాలు, దృశ్యాలు సహా సమాచారం అంతా యాప్‌ నిర్వాహకులు పొందే అనుమతిస్తేనే రుణం వస్తుంది. రుణ గ్రహీత ఒక్కసారి అనుమతిస్తే అతని ఫోన్‌ యాప్‌ నిర్వాహకుల సర్వర్‌కు అనుసంధానమైనట్లే. రుణం ఇచ్చే వేళ షరతులు చాలామంది చదవకుండానే సమ్మతిస్తున్నారు. దీంతో వారం పది రోజుల్లోనే తీసుకున్న అప్పు కంటే వడ్డీ అధికంగా కట్టాల్సి వస్తోంది.

వేధింపులు, బెదిరింపులు..:రుణం చెల్లింపులో ఏ మాత్రం ఆలస్యమైనా వేధింపులు మొదలవుతాయి. మొదట ఫోన్లు చేసి ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని ఒత్తిడి తెస్తారు. ఆ గడువు కూడా దాటితే బెదిరింపుతో మొదలై తిట్టే దాకా వెళుతుంది. ఆపై వారి కుటుంబీకులకు, మహిళలకు ఫోను చేసి దుర్భాషలాడటం, రుణగ్రహీత వ్యక్తిత్వాన్ని కించపరిచి మోసగాడిగా చిత్రీకరించటం, మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలు పంపుతున్నారు. అప్పటికి బాకీ వసూలు కాకపోతే ఫొటో కింద శ్రద్ధాంజలి అని వాట్సప్‌తో పంపిస్తున్నారు. దీంతో రుణగ్రహీతలు క్షోభకు గురవుతున్నారు.

అమలాపురం :అమలాపురం కె.అగ్రహారంలో ఓ ఉద్యోగి రుణ యాప్‌లో రెండు నెలల కిందట రూ.12 వేలు తీసుకున్నారు. దానికి 15 రోజుల్లోగా రూ.14,600 చెల్లించాలి. ఆర్థిక ఇబ్బందితో చెల్లించలేదు. గడువు ముగిసినప్పటి నుంచి యాప్‌ నిర్వాహకులు తరచూ కాల్‌ చేసి రూ.24 వేలు చెల్లించాలనీ.. లేకుంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. అతని స్నేహితులకు, బంధువులకు ఫోన్‌ చేసి వారినీ దూషిస్తున్నారు.

రాజమహేంద్రవరం :రాజమహేంద్రవరంలో ఓ మహిళ ఆన్‌లైన్‌ యాప్‌లో రూ.5,500 అప్పు పొందారు. ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించారు. కానీ.. వారం తర్వాత ఫోన్‌ చేసి ఇంకా రూ.10,500 చెల్లించాలని బెదిరిస్తున్నారు. ఆమె బంధువులకు, స్నేహితులకు ఫోన్‌ చేసి ఆమె గురించి అసభ్యంగా చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తామేమీ చేయలేమన్నారనీ.. చావే శరణ్యమని ఓ వీడియోలో కంటతడి పెట్టారు.

కాకినాడ :కాకినాడలో ఓ అధ్యాపకురాలు ప్రసవ సమయంలో ఖర్చుల కోసం ఓ యాప్‌ ద్వారా రూ.10 వేలు తీసుకున్నారు. చెల్లింపు ఒకరోజు ఆలస్యం కాగా యాప్‌ ప్రతినిధులు బెదిరించారు. ఆమె నగదు తీసుకునే సమయంలో ఇచ్చిన పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఆమె ఫొటోలపై దొంగ అనీ... వ్యభిచారి అని.. ముద్ర వేసి ఆమె చరవాణిలో కాంటాక్ట్‌లో ఉన్న వారికి వాట్సాప్‌ చేశారు. ఇది తెలిసిన ఆమె మనోవేదన వర్ణనాతీతం.

కుప్పకూలిన కలలు

మా అబ్బాయి.. కోనా సతీశ్‌ (28). చాలా నెమ్మదస్తుడు. పీజీ పూర్తి చేశాడు. కుటుంబానికి కొండంత అండగా ఉంటాడని అనుకున్నాం. అప్పులు చేసి జల్సా చేసే వ్యక్తిత్వం కాదతనిది. రుణ యాప్‌లో లోన్‌ తీసుకున్న ఇతరుల కోరిక మేరకు నామినీగా ఉండి ఉండవచ్చు. నగ్నంగా ఉన్న వేరే వ్యక్తి శరీరానికి సతీశ్‌ చిత్రాన్ని జత చేసి అతడి కాంటాక్ట్‌ల్లో ఉన్న వారికి పంపారు. యాప్‌ నిర్వాహకులు పెట్టిన నరక యాతన తాళలేక రైలు కిందపడి ఉసురు తీసుకున్నాడు. రెండు రోజుల నుంచి అతడి చరవాణికి వస్తున్న మెసేజ్‌లు చూస్తుంటే ఎంత క్షోభకు గురయ్యాడో తెలుస్తోంది. చేతికి అందివచ్చిన కొడుకు మృతితో మా గుండె పగిలింది. ఇలాంటి దురాగతాలకు మరెవరూ బలికాకుండా.. నిందితులను ఉరితీయాలి. - సతీశ్‌ తల్లిదండ్రుల వేదన (కడియం)

వెంటనే ఫిర్యాదు చేయండి

లోన్‌ యాప్‌ల ద్వారా రుణం ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్న ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది సమస్య జటిలం అయ్యేదాక తెచ్చుకుంటున్నారు. వేధింపులు మొదలవగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు. మీ సమాచారాన్ని యాప్‌ నిర్వాహకులు తీసుకునేందుకు అనుమతిస్తుండటంతో ఇక్కట్లు వస్తున్నాయి. రుణం ఇచ్చేవారు మన వ్యక్తిగత సమాచారం అడుగుతున్నారంటేనే ప్రమాదం అని గుర్తించాలి. అవగాహన లేకుండా వచ్చిన అన్ని లింకులను ఓపెన్‌ చేయటం.. అనవసరంగా యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయటంతో ఈ సమస్యలు వస్తాయి. -ఐశ్వర్య రస్తోగి, ఎస్పీ, తూర్పుగోదావరి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details