ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బస్సులో భోంచేద్దాం రండి..

Bus Theme Restaurant: ప్రస్తుతం మనకు ఎక్కడ చూసిన రెస్టారెంట్లు దర్శనమిస్తున్నాయి. ఈ వ్యాపారంలో రాణించాలంటే.. విజన్‌ ఎంత ముఖ్యమో.. వినూత్నంగా ఆలోచించడమూ అంతే అవసరం. అలా.. వస్తున్నవే కొంగొత్త థీమ్‌ బేస్డ్‌ రెస్టారెంట్లు. వ్యాపారం చేయాలని భావించిన కర్నూలుకు చెందిన ఈ ముగ్గురు మిత్రులూ అదే కోవలో ఆలోచన చేశారు. సెకండ్ హ్యాండ్ సూపర్ లగ్జరీ బస్సు కొనుగోలు చేసి.. "డైన్ ఆన్ బస్" థీమ్ రెస్టారెంట్‌ ప్రారంభించారు. మరి కర్నూలు వాసులకు విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ "డైన్‌ ఆన్ బస్‌" సంగతులేంటో మనమూ చూసేద్దామా.

By

Published : Mar 26, 2022, 4:15 PM IST

Published : Mar 26, 2022, 4:15 PM IST

Bus Theme Restaurant
Bus Theme Restaurant

Bus Theme Restaurant: వ్యాపారంలో ఒక్కొక్కరిది ఒక్కో పంథా..! అందరి అంతిమ లక్ష్యం కస్టమర్స్‌ని ఆకట్టు కోవడమే. కర్నూలుకి చెందిన ఈ ముగ్గురు ఇదే బాటలో పయనించి.. అందరినీ తమ రెస్టారెంట్‌కు వచ్చేలా చేసుకుంటున్నారు. పాతపడ్డ ప్రైవేట్‌ సూపర్ లగ్జరీ బస్సు కొనుగోలు చేసి.. థీమ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు.

బస్సులో భోంచేద్దాం...రండి...

" కర్నూలులో తొలిసారి ఇలా బస్ థీమ్ రెస్టారెంట్ ఏర్పాటు చాలా బాగుంది. చిన్న చిన్న ఫంక్షన్లను కుటుంబ సభ్యులంతా కలిసి ఇక్కడ జరుపుకోడానికి కూడా చాలా బాగుంటుంది. కొత్త ఆలోచన బాగుంది."-డాక్టర్ త్రివేణి, కర్నూలు.

"కొత్త కాన్సెప్ట్ తో కర్నూలులో ఇలా బస్ థీమ్ రెస్టారెంట్ ఏర్పాటు చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. మా స్నేహితులంతా కలిసి ఇక్కడికి వచ్చాం. మాకు బాగా నచ్చింది. ఇంకా నాలుగు బస్సులతో పెద్దదిగా చేస్తే ఇంకా బాగుంటుంది. "-వీణా, కర్నూలు

వినూత్నంగా రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని వీరు.. మెుదట 2 లారీ కంటైనర్లు తీసుకు వచ్చారు. వాటిలో టిఫిన్స్, ఐస్‌క్రీం పార్లర్ ప్రారంభించారు. అల్పాహారం బాగుండటంతో... మంచి స్పందన వచ్చింది. అనంతరం విజయవాడలో సెకండ్ హ్యాండ్... బస్సు కొనుగోలు చేశారు. సీట్లు తొలగించి... 16 మంది కూర్చునేలా "బస్సు రెస్టారెంట్" అందుబాటులోకి తెచ్చారు.

" ఈ బస్ కాన్సెప్ట్ కర్నూలులో కొత్తగా ఏర్పాటు చేశారు. స్నేహితులతో కలిసి వచ్చాం. చాలా బాగుంది. మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉంది. " -ఫరీదాబేగం, కర్నూలు.

" ఇలా బస్సులో రెస్టారెంట్ అనే కొత్త ఆలోచన చాలా నచ్చింది. కొత్తదనాన్ని ఆశ్వాదించాలనే వచ్చాము. మళ్లీ మళ్లీ వద్దామనేంతగా నచ్చింది. కర్నూలులో ఇదే తొలిసారి ఇలాంటి రెస్టారెంట్ రావడం."-విజయసారధి, కర్నూలు

బస్సు, రెండు కంటైనర్లని కలుపుతూ 64 మంది పైన కూర్చునే విధంగా తీర్చిదిద్దారు. రాత్రి సమయంలో చల్లని గాలిలో... సేదతీరుతూ... హాయిగా నచ్చిన ఆహారం తినే వెసులుబాటు ఉండటంతో కస్టమర్స్‌ క్యూ కడుతున్నారు. కింద ఖాళీ స్థలంలోనూ 24 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి :Nakka Anandbabu: న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు సీఎం యత్నం: నక్కా ఆనంద్ బాబు

"ఆకాశంలో చందమామ, చుక్కలను చూస్తూ చల్లటి గాలులను ఆస్వాదిస్తూ...ఇలా విద్యుత్ దీపాల కాంతుల మధ్య టెర్రాస్ మీద కూర్చుని తినటం చాలా బాగుంది. చాలా ఆహ్లాదంగా ఉంది. బిజీ జీవితంలో కాస్త సేదతీరటానికి ఇలాంటివి చాలా బాగుంటాయి."-ఐశ్వర్య, కర్నూలు

"థీమ్ రెస్టారెంట్లని హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లోనే చూశాము. కానీ కర్నూలులో పెట్టడం చాలా బాగుంది. ఇది ఉన్న థీమ్ లా కాకుండా సరికొత్తగా తీసుకు వచ్చారు. అది బాగా నచ్చింది. ఇస్టాగ్రాంలో చూసి వచ్చాం. ఫుడ్ కూడా బాగుంది."-రితేష్, కర్నూలు

ఈ థీమ్ రెస్టారెంట్ లో... ఓ ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి సినిమా పాటలు ప్రదర్శిస్తూ... వినియోగదారుల్లో జోష్‌ నింపుతున్నారు. ఇక్కడికి వస్తే... నిజమైన బస్సులోకి ఎక్కి భోజనం చేసిన అనుభూతి కలుగుతుంది. తక్కువ ధరల్లోనే రుచికరమైన వంటలు లభిస్తుండటంతో కర్నూలు వాసులు మళ్లీ మళ్లీ ఈ రెస్టారెంట్‌కు వస్తున్నారు.

కర్నూలుకు చెందిన శేఖర్.. టాటా కంపెనీలో డిజైన్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. తన స్నేహితుడు వినయ్ హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడు. శేఖర్ తమ్ముడు శ్రీకాంత్ కర్నూలులోనే ఉండేవాడు. ఈ ముగ్గురికి... ఏదైనా కొత్తగా రెస్టారెంట్‌ పెట్టాలనే ఆలోచన ఉండేది. కరోనా సమయంలో ఖాళీగా ఉండటంతో.. వారి ఆలోచనను ఇలా ఆచరణలోకి తీసుకువచ్చారు.

"కర్నూలు ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది. కేవలం రెస్టారెంట్ లాగానే కాకుండా పుట్టినరోజు, పెళ్లిరోజులు, చిన్న చిన్న ఫంక్షన్లను కూడా జరుపుకుంటున్నారు. ఈరోజుల్లో ప్రజలు సరికొత్తగా ఉండే కన్వెన్షన్ వంటి రెస్టారెంట్లను కోరుకుంటున్నారు. మేము అదే ఆలోచనతో దీనిని ఏర్పాటు చేశాం. వృధాగా దేనిని పరిగణించకూడదు అనే ఉద్దేశంతో ఇలా పాత బస్సు, కంటెయినర్లను తీసుకుని దీన్ని రూపొందించాము. ఫుడ్ కు స్పందన చాలా బాగుంది. నాణ్యమైన సేవలందిస్తే ఎలాంటి వ్యాపారమైనా విజయవంతమవుతుంది. మేము అదే సూత్రాన్ని నమ్మి..అనుసరిస్తున్నాము." -శేఖర్, థీమ్ రెస్టారెంట్ నిర్వాహకుడు

మొదట్లో రెస్టారెంట్ లో శాకాహార వంటలే తయారు చేసేవారు. దాని వలన పెద్దగా వ్యాపారం జరగలేదు. వినియోగదారుల కోరిక మేరకు నాన్ వెజ్ సైతం అందుబాటులోకి తీసుకు వచ్చారు. అప్పటినుంచి తాకిడి పెరిగిందని నిర్వాహకులు అంటున్నారు.

"ఆర్గానికి ఫుడ్ రెస్టారెంట్ పెట్టాలని నేను, నా స్నేహితుడు శేఖర్ ఏడేళ్ల క్రితమే ప్రణాళిక చేసుకున్నాం. కానీ అప్పుడు ఉద్యోగాలు రావడంతో మరుగున పడిపోయింది. కరోనాతో మా ఆలోచనలన్నీ మారిపోయాయి. ఆ తరువాత మేమిద్దరం కలిసి సరికొత్త ఆలోచనతో థీమ్ రెస్టారెంట్ ప్రారంభిద్దామని నిర్ణయానికి వచ్చాం. ఆ ఆలోచనల్లోంచి వచ్చిందే మా ఈ 'డైన్‌ ఆన్ బస్‌' రెస్టారెంట్. దేవుని దయ వల్ల మాకు చాలా మంచిపేరు వచ్చింది."-వినయ్, థీమ్ రెస్టారెంట్ నిర్వాహకుడు

ఈ రెస్టారెంట్‌ ఏర్పాటు కోసం 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో... చిన్నపిల్లల కోసం పార్కు, బస్సు, కంటైనర్ల పై భాగంలో సెమీ క్లోజ్డ్ రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమంటున్నారు.

ఇదీ చదవండి :"నా భర్తను అక్రమంగా అరెస్టు చేశారంటూ.."

ABOUT THE AUTHOR

...view details