అనంతపురం జిల్లా కదిరిలోని ముత్యాల చెరువు, దేవర చెరువు, పంతుల చెరువు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా ఎర్రదొడ్డి వద్ద మద్దిలేరు వాగు(maddileru stream) ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నార్పలలో కూతలేరు వంక పరవళ్లు తొక్కుతోంది. మండల కేంద్రంలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండగా... వాహనాల రాకపోకలకు ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు(diversion road) కోతకు గురవుతోంది. దీనివల్ల వాహనదారులు భయంభయంగా ప్రయాణిస్తున్నారు. యల్లనూరు మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో చెరువులకు(ponds) భారీగా వరద నీరు చేరుతోంది.
కడపలో కురుస్తున్న భారీ వర్షానికి నగరం మొత్తం జలమయమయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, అంబేడ్కర్ కూడలి, ఆర్టీసీ కార్మిక భవనాల సముదాయం చుట్టూ వర్షం నీరు చేరింది. భాగ్యనగర్ కాలనీ, అప్సర రోడ్డు, మృత్యుంజయ కుంట, గంజికుంట కాలనీ, ప్రకాష్ నగర్, రామరాజుపల్లి, అల్లూరి సీతారామరాజు నగర్ తదితర ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.