ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరును కమ్మేస్తున్న కరోనా మహమ్మారి

గుంటూరు నగరాన్ని కరోనా గజగజ వణికిస్తోంది. నగరంలో రోజురోజుకీ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా...వ్యాప్తి అదుపులోకి రావటం లేదు. దీంతో నగరంలో కేసుల సంఖ్య రెండు వేలకు చేరువైంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా అధికారులు కంటైన్మెంట్ జోన్లను పెంచటంతో పాటు.. వ్యాధి నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేశారు. గుంటూరులో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, పరీక్షలపై ఈటీవి భారత్ ప్రత్యేక కథనం.

By

Published : Jul 17, 2020, 5:47 PM IST

గుంటూరును కమ్మేస్తున్న కరోనా మహమ్మారి
గుంటూరును కమ్మేస్తున్న కరోనా మహమ్మారి

గుంటూరు జిల్లాలో కొవిడ్ 19 కేసులు 5 వేలు దాటగా.. అందులో రెండు వేల కేసులు ఒక్క గుంటూరులోనే నమోదయ్యాయి. గుంటూరు నగరంలో ఎక్కువ కేసులు నల్లచెర్వు ప్రాంతంలో నమోదయ్యాయి. ఇక్కడ 161 కేసులున్నాయి. అలాగే శ్రీనివాసరావుతోట, ఐపీడీ కాలనీ, సంగడిగుంట, సంపత్ నగర్, పాతగుంటూరు, బ్రాడీపేట, అరండల్ పేట, ఏటీ అగ్రహారం, కుమ్మరిబజార్, ఆర్టీసీ కాలనీ, గుంటూరు వారి తోట, లాలపేట ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఉంచుతున్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. నగరంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న దృష్ట్యా వ్యాధి నిర్ధరణ పరీక్షలు ముమ్మరం చేశారు. కంటైన్మెంట్ జోన్ల వద్దకే వైద్య సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో వెళ్లి నమూనాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రైమరీ కాంటాక్ట్స్ కు పరీక్షలు చేసి వారికి వైరస్ వచ్చిందో లేదా నిర్ధరించటం ద్వారా కరోనా వ్యాప్తిని నివారిస్తున్నారు. యాంటిజెన్ కిట్ల ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. పరీక్ష చేయించుకున్న వారి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వర్ నెమ్మదించడంతో ఈ ప్రక్రియ కొంచెం మందకొడిగా సాగుతోంది. ప్రైమరీ కాంటాక్ట్స్ అందరినీ వాలంటీర్ల ద్వారా సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి పిలిపించి అక్కడే ఈ పరీక్షలు చేసేలా చర్యలు చేపడుతున్నారు.

నగరంలో లాక్ డౌన్ ఆంక్షలు తీవ్రతరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తెరవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే మాస్క్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధిస్తున్నారు. వాహనాలపై ఎక్కువమంది వెళ్లకుండా చర్యలు చేపట్టారు.

కంటైన్మెంట్ జోన్లలో నిత్యం బ్లీచింగ్ చల్లుతున్నాం. అలాగే సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి చేయిస్తున్నాం. నిత్యావసరాల పరంగా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎంపిక చేసిన కిరాణా దుకాణాలు ఉదయం 11 గంటల వరకు తెరిచేందుకు అనుమతించాం. అలాగే కూరగాయలు కూడా అందుబాటులో ఉంచుతున్నాం.---శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ ఏఈ

కేసులు ఎక్కువగా నమోదైనందున కంటైన్మెంట్ జోన్లలోకి బయటి నుంచి రాకపోకలు నిషేధించాం. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ప్రజలు ఎక్కువగా బయటకు రాకుండా, గుంపులుగా ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొందరు బారికేడ్లు దాటి వస్తున్నారు. వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ---హైమారావు, సీఐ

ఎవరైనా పాజిటివ్ గా తేలిన వెంటనే వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ గుర్తించే ప్రక్రియ మొదలుపెడుతున్నాం. కేవలం గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కావాలి. అవసరాన్ని బట్టి ఆయా కాలనీల్లోనే మొబైల్ వాహనం ద్వారా నమూనాలు సేకరిస్తున్నాం. కంటైన్మెంట్ జోన్లలో 60 ఏళ్లకు పైబడిన అందరికీ తప్పనిసరిగా పరీక్షలు చేస్తున్నాం. అన్నీ కూడా ఆన్ లైన్లో నమోదు చేస్తున్నాం. ---ప్రశాంతి, సంయుక్త కలెక్టర్, గుంటూరు జిల్లా

ఇదీ చదవండి :నకిలీ బంగారం తనఖా పెట్టి రూ.40 లక్షలు స్వాహా

ABOUT THE AUTHOR

...view details