ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విరుచుకుపడుతున్న మహమ్మారి.. బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షల విధింపు

రాష్ట్రంపై కరోనా వైరస్‌ విరుచుకుపడుతోంది. గంటకు 400 మందికి పైగా కరోనా బారిన పడుతుండగా..ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు అమలులోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడే అంశాలపై ఆంక్షలు విధించింది.

By

Published : Apr 27, 2021, 9:21 AM IST

corona cases increasing in andhra pradesh
ఏపీలో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి

ఏపీలో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి

రాష్ట్రంలో గంటకు 411 మంది కరోనా బారిన పడుతుండగా... ఇద్దరు మరణిస్తున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితుల్ని నియంత్రణలోకి తెచ్చేందుకు.. బహిరంగప్రదేశాల్లో ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడాప్రాంగణాలు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూళ్లను మూసివేయాల్సిందిగా ఆదేశించింది. ప్రజారవాణా, సినిమాహాళ్లు.. 50 శాతం సామర్ధ్యంతో మాత్రమే పని చేయాలని స్పష్టం చేసింది. వివాహాది శుభకార్యాలు, ఎక్కువ మంది గుమికూడే అవకాశం ఉన్న అన్ని అంశాల్లోనూ... 50 మందికి మించి పాల్గొనకూడదని స్పష్టం చేసింది. అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరయ్యేలా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ప్రతి సీటుకూ 5 అడుగుల సామాజిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా.. విజయవాడలో వ్యాపార సంస్థలన్నింటినీ మధ్యాహ్నం 2 గంటలకే మూసివేయాలని చాంబర్ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయించింది. విశాఖ నగరంలో విహార స్థలాలు, పార్కులన్నింటినీ మూసివేస్తూ జీవీఎంసీ, వీఎమ్​ఆర్​డీఏ ఆదేశాలిచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం మతపరమైన కార్యక్రమాలు, వాణిజ్య లావాదేవీలపై ఆంక్షలు విధించింది. మసీదుల్లో నాలుగో వంతు సంఖ్యలో మాత్రమే ప్రార్థనలకు అనుమతినిస్తూ ఆదేశాలిచ్చారు. ఆలయాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకే భక్తుల్ని అనుమతించాలని స్పష్టం చేశారు. చర్చిల్లోనూ మతపరమైన కార్యక్రమాలను పాస్టర్లు మాత్రమే నిర్వహించాలని తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో.. వ్యాపార కార్యకలాపాలు మధ్యాహ్నం రెండు గంటల వరకే నిర్వహించాలని ఆదేశించారు.

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున..ప్రజలు మాస్కు తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరేగింపులు, పండుగలు జరపరాదని చెప్పారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటూ.. కలెక్టరేట్‌ వద్ద హిజ్రాలు అవగాహన కల్పించారు. మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని.. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని వివరించారు. కడప జిల్లాలో కొవిడ్ రెండో దశ వ్యాప్తి నియంత్రణ చర్యలు పటిష్ఠంగా అమలు చేయాలని.. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌.. అధికారుల్ని ఆదేశించారు. నల్లబజారులో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల విక్రయంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఇదీ చదవండి: ఆస్పత్రుల్లో హృదయ విదారక దృశ్యాలు..బరువెక్కుతున్న గుండెలు

ABOUT THE AUTHOR

...view details