ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 26, 2021, 3:46 PM IST

Updated : Jul 26, 2021, 7:14 PM IST

ETV Bharat / city

రంగయ్యకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీబీఐపై ఉంది: తెదేపా

వైఎస్‌ వివేకా హత్య కేసులో వాచ్‌మెన్‌ రంగయ్య వాంగ్మూలంతో జగన్‌ అండ్‌కో గుండెల్లో వణుకు మొదలైందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కోరిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక అవసరం లేదనడాన్ని తెదేపా నేతలు తప్పుపట్టారు. రంగయ్యకు ప్రభుత్వం పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

tdp leaders comments on viveka murder case
tdp leaders comments on viveka murder case

తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పార్టీ ముఖ్యనేతలతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై తీర్మానాలతో పాటు భవిష్యత్‌ కార్యాచరణకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నట్లు భేటీ తర్వాత తెదేపా ఓ ప్రకటన విడుదల చేసింది. వివేకాను హత్య చేసేందుకు 8 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చేంత అవసరం ఎవరికి ఉందో... ఇన్ని నెలలైనా ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు తెలుసుకోలేదని ఆ ప్రకటనలో తెదేపా నేతలు నిలదీశారు. పరిటాల రవి హత్యలో సాక్షుల్ని చంపినట్లే వివేకా కేసులో ఉన్నవారూ కొందరు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. హత్యకేసులో వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మెన్‌ రంగయ్యకు ఏం జరిగినా జగన్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆయనకు ప్రభుత్వం పూర్తిరక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

రాజీనామాకు సిద్ధం..

నదీ జలాల విషయంలో జగన్‌ ప్రభుత్వం రాయలసీమకు ద్రోహం చేస్తోందని తెదేపా నేతలు ఆక్షేపించారు. తెలుగువారి త్యాగాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించేందుకు సిద్ధమని పునరుద్ఘాటించారు. వైకాపా ఎంపీలూ రాజీనామాలకు సిద్ధపడతారా అని సవాల్‌ విసిరారు. నూతన జాబ్‌ క్యాలెండర్‌ కోసం ఆందోళన నిర్వహించిన యువతపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. ఈ నెల 28లోగా కొత్త క్యాలెండర్‌ ఇచ్చి తీరాలంది. నిత్యావసరాలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించుకునేలా పోరాటాలు ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని నేతలు డిమాండ్‌ చేశారు.

బకాయిలు చెల్లించండి..

హైకోర్టు ఆదేశాల మేరకు జులై నెలాఖరుకు ఉపాధి హామీ బిల్లుల బకాయిల చెల్లించాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు. మద్యనిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైకాపా.. ఇప్పుడు 15 ఏళ్ల పాటు మద్యం ఆదాయాన్ని చూపించి 25వేల కోట్లు అప్పులు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అస్తవ్యస్థంగా ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. గిట్టుబాటు ధరల కోసం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది.

ఇదీ చదవండి:

JAGAN CASE: మరోసారి గడువు కోరిన సీబీఐ.. 'జగన్‌ బెయిల్‌ రద్దు' పిటిషన్‌పై విచారణ వాయిదా

Last Updated : Jul 26, 2021, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details