ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Posani to pk: 'ముందు ఆ పంజాబ్ అమ్మాయికి న్యాయం చేయాలి పవన్!'

By

Published : Sep 28, 2021, 4:38 PM IST

'రిపబ్లిక్' ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌కల్యాణ్‌ మాట్లాడిన మాటలపై సినీనటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. సినిమా ఈవెంట్​లో పొలిటికల్ విషయాలు మాట్లాడి సీఎం, మంత్రులను విమర్శిస్తున్న పవన్.. ముందుగా పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Posani
Posani

'ముందు ఆ పంజాబ్ అమ్మాయికి న్యాయం చేయాలి పవన్!'

'రిపబ్లిక్' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా పవన్‌కల్యాణ్‌ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. పవన్‌ వ్యాఖ్యల పట్ల పలువురు వైకాపా మంత్రులు, నాయకులు కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పోసాని విలేకరులతో మాట్లాడారు. సినిమా ఈవెంట్​లో పొలిటికల్ విషయాలు మాట్లాడి సీఎం, మంత్రులను విమర్శిస్తున్న పవన్.. ముందుగా పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే చాలని వ్యాఖ్యానించారు.

తెలుగు పరిశ్రమకు ఓ పంజాబ్ అమ్మాయి.. ఎన్నో కలలతో వచ్చి సినిమాలు చెయ్యాలి అనుకుంటే.. ఇండస్ట్రీలోని ఓ ప్రముఖుడు అవకాశాలు ఇస్తానని చెప్పి కడుపు చేసి.. పెళ్లి చేసుకుంటానని ఆమెని మోసం చేశాడని... ఆ పంజాబ్ యువతి పేరు బయటకు చెప్పొద్దు కాబట్టి పవన్ కల్యాణ్ చెవిలో చెబుతానని.. ప్రశ్నించే దమ్మున్న పవన్ ఆమెకి న్యాయం చేస్తాడా? ఆమె కోసం పోరాడతాడా? అని సవాల్​ విసిరారు. ఆ యువతికి న్యాయం చెయ్యకపోతే.. పవన్​కు​ ప్రశ్నించే హక్కు లేదన్నారు. ఆ యువతికి న్యాయం చేస్తే పవన్​కు తాను గుడి కడతానంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

''జగన్‌ అంటే నాకు అభిమానం. నేను చచ్చిపోయే వరకూ ఆయనపై అభిమానం కొనసాగుతుంది. ఒకవేళ ఆయన తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు నాకుంది. అయితే, ఆయన అలాంటి వ్యక్తికాదని నమ్ముతున్నా. వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నిస్తే తప్పు లేదు. అందుకు సాక్ష్యాలు చూపించాలి. అది నిజమైతే మీకు నమస్కారం పెడతాం. జనసేనకే సేవ చేస్తాం. చిరంజీవిగారు పార్టీ పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకులను అసభ్య పదజాలంతో అవమానించడం మీరు ఎప్పుడైనా చూశారా? మీరు ఎవరిని ప్రేరణగా తీసుకుని దూషిస్తున్నారు? ప్రజల్లో ఒకడిగా ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది’''

''సాయిధరమ్‌తేజ్‌ ప్రమాదంలో గాయపడటంతో పవన్‌ ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకకు వచ్చారు. సాయితేజ్‌ ఎవరి దయాదాక్షిణ్యాలతో హీరో అవ్వలేదు. వాళ్లమ్మగారి పెంపకం. అతడు నటించిన ‘చిత్రలహరి’లో నేను తండ్రి పాత్ర చేశా. దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదం జరిగింది. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిద్దాం. ప్రీరిలీజ్‌ వేడుకకు వచ్చి సాయిధరమ్‌ తేజ్‌ గురించి మాట్లాడాలి. అతడు మంచి వాడని, మంచి పనులు చేస్తున్నాడని చెప్పాలి. మేనమామ చిరంజీవి పోలికలు వచ్చాయి.. ఇంకా పైకి రావాలని కోరుకోవాలి. కానీ, ఆ వేడుకలో సీఎం జగన్‌ను, మంత్రులు, ఎమ్మెల్యేలను నోటికొచ్చినట్లు మాట్లాడారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మంత్రులను తిట్టడం సరికాదు. పవన్‌ వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది''

''జగన్‌కు కులం పిచ్చి ఉందని ఎవరైనా నిరూపిస్తారా? జగన్‌ కుటుంబంతో కలిసి 15 రోజులు పులివెందులలో ఉన్నా. వాళ్లంతా అక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. జగన్‌ ప్రత్యేకంగా పులివెందులకు వెళ్లకపోయినా ఆయన గెలుస్తారు. అలా ఎవరైనా గెలవగలరా? పవన్‌ మీరు రెండు నియోజకవర్గాల్లో నిలబడ్డారు? ఒకదానిలోనైనా గెలిచారా? నిజాయతీకి గెలుపు కొలమానం కాదని అనుకుందాం. మీ గొప్పతనం ప్రజలు గుర్తించలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పు చేస్తే పోలీసు కేసులు పెడదాం. ఈలోగా మీరొక పని చేయాలి. తెలుగు సినీ పరిశ్రమలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మీరు పెద్ద హీరో. మీరు పరిష్కరించగలరు. ముందు ఆ సమస్యలను పరిష్కరించండి'' అని పోసాని పవన్‌కల్యాణ్‌కు సూచించారు.

ఇదీ చదవండి

రైతుల ఉద్యమం పవన్ కల్యాణ్​కు కనిపించడం లేదా?: సీపీఐ రామకృష్ణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details