ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో!

By

Published : Jun 20, 2020, 6:19 AM IST

Updated : Jun 20, 2020, 11:44 AM IST

రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణరావు మంత్రి పదవులకు రాజీనామా చేయనుండటంతో.. వారి స్థానాల్ని ఎవరితో భర్తీ చేస్తారు? మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? లేకపోతే ఆ శాఖల్ని వేరేవారికి కేటాయిస్తారా అన్న అంశంపై వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

cm jagan
cm jagan

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ క్రమంలో వారికి ఇప్పుడున్న మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు. మరి వారి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారు..?మంత్రి వర్గవిస్తరణ ఉంటుందా..?ఇలా అనేక ప్రశ్నలపై వైకాపాలో చర్చ జరుగుతోంది. ఆ రెండు స్థానాల్ని భర్తీ చేయాలని సీఎం జగన్‌ నిర్ణయిస్తే అది విస్తరణకే పరిమితమవుతుందా? మంత్రుల్లో ఎవరినైనా తొలగించి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారా? అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది.

బోస్‌, మోపిదేవి ఇద్దరూ ముఖ్యమంత్రి జగన్‌కు మొదటి నుంచీ సన్నిహితులు. ఇద్దరూ బీసీ సామాజికవర్గాలకు చెందినవారే. వారిద్దరూ 2019 ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బోస్‌ అప్పటికే ఎమ్మెల్సీగా ఉండగా, మోపిదేవిని తర్వాత ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. బోస్‌కి ఉపముఖ్యమంత్రి హోదా, కీలకమైన రెవెన్యూశాఖను అప్పగించారు. మోపిదేవికీ మంచి శాఖలే ఇచ్చారు. మండలి రద్దయితే వారిద్దరూ పదవులు కోల్పోతారు కాబట్టి, రాజ్యసభకు పంపించారు. ప్రస్తుత మంత్రివర్గం రెండున్నరేళ్లు ఉంటుందని, తర్వాత కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తానని అధికారంలోకి రాగానే జగన్‌ ప్రకటించారు. ఆ లెక్కన పునర్వ్యవస్థీకరణకు ఏడాదిన్నర ఉంది. అన్నాళ్లు ఆగరని, ఈలోగానే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సామాజిక సమతూకం కోసం మళ్లీ బీసీలకే అవకాశం రావొచ్చు. ఆ ఇద్దరూ ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం..!

ఇదీ చదవండి:కొత్త రాజ్యసభ సభ్యులు..రాజకీయ జీవితం

Last Updated : Jun 20, 2020, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details