ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 6, 2020, 9:10 AM IST

ETV Bharat / city

'కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై ప్రమాణపత్రం కావాలి'

కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయమని ఆదేశించింది. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది ధర్మాసనం.

hicourt-question
hicourt-question

విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయం, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. పరిపాలన సంబంధ కారణాలు/సౌలభ్యం కోసం తరలిస్తున్నామని చెబుతున్న నేపథ్యంలో సంబంధిత నోట్‌ఫైల్స్‌, ప్రొసీడింగ్స్‌తో మూడు రోజుల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. పరిపాలన సంబంధ కారణాలేమిటి? పాలన సౌలభ్యం ఏమిటో తాము పరిశీలించాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయం, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31న ఉత్తర్వులిచ్చింది.

వారిని ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదు?

ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తాళ్లాయపాలేనికి చెందిన రైతు కొండేపాటి గిరిధర్‌, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు వేర్వేరుగా హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. గిరిధర్‌ తరఫున న్యాయవాది ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. అన్ని అంశాలు పరిశీలించి తరలింపునకు నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో పేర్కొన్నారన్నారు. కానీ ఎలాంటి పరిశీలన చేయలేదన్నారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపేయాలన్న దురుద్దేశంతో ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినా దాని నివేదికలను బహిర్గతం చేయలేదన్నారు. విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాలయాలు సచివాలయంలో భాగం అన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. దురుద్దేశంతో వ్యవహరించిన వారిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. పేర్కొంటే వారిని కోర్టుకు పిలిచి వివరణ కోరేవాళ్లమని తెలిపింది. ఉపన్యాసాలకు న్యాయస్థానాలు వేదిక కాదంది.

సీఆర్‌డీఏ అనుమతి లేకుండా తరలించకూడదా?

మరో న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ శాఖలన్నీ సీఆర్‌డీఏ చట్టం ప్రకారం నోటిఫై అయి ఉన్నాయన్నారు. సీఆర్‌డీఏ అనుమతి లేకుండా కార్యాలయాలను తరలించడానికి వీల్లేదన్నారు. తరలింపునకు సీఆర్‌డీఏ అనుమతి తీసుకోవాలని ఎక్కడుందో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఏ నిబంధన ప్రకారం తరలించకూడదో చెప్పకుండా, సరైన ఆధారాలు లేకుండా వ్యాజ్యం దాఖలు చేసి కోర్టులో నిల్చుంటే సరిపోతుందా? అని కోర్టు ప్రశ్నించింది. వివరాలు చెప్పకపోతే ఏం చేస్తామని వ్యాఖ్యానించింది. నోట్‌ఫైళ్లతో పాటు ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఏజీకి స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. పిటిషనర్లు ఈ వ్యాజ్యాల్లో అదనపు సమాచారం దాఖలు చేసేందుకు వెసులుబాటూ ఇచ్చింది.

విశాఖ వార్డుల పునర్విభజనపై ముగిసిన వాదనలు

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ) వార్డుల పునర్విభజన నిమిత్తం గత నెల 24న జారీచేసిన తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి తీర్పును వాయిదా(రిజర్వు) వేశారు.

ఇవీ చదవండి: 'ప్రభుత్వ కార్యాలయాలపై సీఎం బొమ్మెందుకు?'

ABOUT THE AUTHOR

...view details