ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అప్రమత్తమైన అటవీశాఖ.. పులిబోన్లు ఏర్పాటు

By

Published : Nov 14, 2020, 2:18 PM IST

తెలంగాణ కుమురం భీం జిల్లాలో విఘ్నేష్‌ అనే యువకుణ్ని పులి చంపడం, తాజాగా బెజ్జూరు మండలంలో సంచరించడం వల్ల అటవీశాఖ అప్రమత్తమైంది. దహేగం, బెజ్జూరు అటవీ ప్రాంతాలతోపాటు.. ప్రాణహిత నదీపరివాహాక ప్రాంతంలో పులి ఆచూకీ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌ నుంచి రెండు పులిబోన్లను ప్రత్యేకంగా తెప్పించి దిగడా అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. పులి ఎరకోసం రెండు లేగదూడలు, రెండు మేకలను ఉంచి.. పులి సంచారాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

forest-department
forest-department

అప్రమత్తమైన అటవీశాఖ.. పులిబోన్లు ఏర్పాటు

తెలంగాణ.. ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కొంతకాలంగా పెద్దపులుల సంచారం.. ప్రజల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ నెల 11న కుమురంభీం జిల్లా దహేగం మండలం దిగిడ అటవీప్రాంతంలో.. పశువులను మేపడానికి వెళ్లిన విఘ్నేష్‌ అనే యువకున్ని చంపడం.. ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం బెజ్జూరు మండలం సిద్ధాపూర్‌- మత్తడివాగు సమీపంలో మరోసారి పులి ప్రత్యక్షం కావడం వల్ల అటవీశాఖ మరింత అప్రమత్తమైంది.

కవ్వాల్‌ పులుల అభయారణ్యం ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌ నేతృత్వంలో.. అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. విఘ్నేష్‌ను హతమార్చిన ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారుల బృందం.. స్థానికులకు భరోసా కల్పించేలా యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌ నుంచి రెండు పులిబోన్లను ప్రత్యేకంగా తెప్పించి దిగడా అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. పులి ఎరకోసం రెండు లేగదూడలు, రెండు మేకలను ఉంచి.. పులి సంచారాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

దహేగాం, బెజ్జూరు మండలాల పరిధిలోని దిగడా, టేపర్‌గాం, రాంపూర్‌, శంకరాపురం, రావులపల్లి, మొట్లగూడ పరిసరాల్లో పులి కదలికలను పరిశీలిస్తున్నారు. ఆసిఫాబాద్‌ అటవీశాఖ అధికారి శాంతారాం నేతృత్వంలో దాదాపు 35 మంది సిబ్బంది ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్న అటవీ ప్రాంతాల రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

పులిదాడిలో మృతిచెందిన విగ్నేష్‌ కుటుంబానికి సిర్పూర్‌ శాసనసభ్యుడు కోనప్ప చేతుల మీదుగా రూ. 5లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేసిన అటవీశాఖ అధికారులు.. ఆయన కుటుంబీకులకు తాత్కాలిక ఉద్యోగం కల్పించేలా ప్రతిపాదనలు తయారుచేశారు. అటవీప్రాంతంలో జనసంచారం పెరగడం వల్ల పెద్దపులి తిరిగి మహారాష్ట్రకు వెళ్లి ఉంటుందనే ఆలోచనలో అధికారులు భావిస్తున్నప్పటికీ.. మరో ప్రమాదానికి తావీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:'భారత్​ సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు ఇస్తాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details