కరోనా బాధితులు చాలామందిలో రక్తం గడ్డకట్టే గుణం కనిపిస్తోంది. కొవిడ్ నిర్ధరణ అయినప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటివారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని స్టార్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ గూడపాటి రమేశ్ హెచ్చరించారు. కరోనా బాధితులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మొదట ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని, ఆ తరవాత గుండె మీద అధిక ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి పలువురికి వైద్య చికిత్స అందించిన డాక్టర్ గూడపాటి రమేష్ ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
కరోనా బాధితుల్లో పలువురు రక్తం గడ్డకట్టి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పాజిటివ్ వచ్చినప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. నెగెటివ్ వచ్చే వరకు డీహైడ్రేషన్ తలెత్తకుండా, రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల వరకు ద్రవపదార్థాలు తీసుకోవాలి. మంచినీళ్లు, పాలు, మజ్జిగ, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే రక్తం కొంతవరకు గడ్డకట్టే పరిస్థితి ఉండదు. కరోనా బాధితుల రక్తంలో అనూహ్యంగా డీడైమర్ స్థాయులు పెరిగిపోతున్నాయి. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు మహమ్మారి బారిన పడినా, లక్షణాల తీవ్రత అధికంగా ఉన్నా, వైద్యుల సూచనల మేరకు డీడైమర్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. డీడైమర్ స్థాయి పెరిగితే సాధారణ కొవిడ్ బాధితులు వైద్యుల పర్యవేక్షణలో కొద్దిరోజుల పాటు రక్తాన్ని పలచబరిచే బ్లడ్ థిన్నర్లు వాడాలి. దీర్ఘకాలిక గుండె జబ్బు, రక్తపోటు ఇతర అనారోగ్య సమస్యలున్న వారు నెల నుంచి మూడు నెలల వరకు ఈ మందులు వేసుకోవాలి.
పాజిటివ్ వచ్చిన వారు గుండె పనితీరును చక్కగా ఉంచుకొనేందుకు ఏం చేయాలి?
చాలామందిలో ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నాయి. ఐసొలేషన్లో ఉన్నప్పుడు 24 గంటలూ పడుకుని ఉండకూడదు. తప్పనిసరిగా 5 నిమిషాలు నడవడం లేదా ఇతరత్రా చిన్నపాటి వ్యాయామాలైనా చేయాలి. తద్వారా ఆక్సిజన్ శాతం మెల్లమెల్లగా పెరుగుతుంది. పడక మీద ఉన్నప్పటికీ కాళ్లను చిన్నగా ఊపడం ద్వారా కండరాల్లో చురుకుదనం తీసుకురావచ్చు. నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసుకోవచ్చు. ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలతో ప్రాణహాని నుంచి బయటపడవచ్చు.