ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TIDCO houses : అప్పెప్పుడు పుట్టాలి.. ఇళ్లెప్పుడు కట్టాలి?

By

Published : Aug 22, 2021, 5:14 AM IST

గత ప్రభుత్వ హయాంలో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) రాష్ట్రంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. రుణ సేకరణతోనే పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తుండగా.. అంత మొత్తం ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపడంలేదు. బ్యాంకర్లతో మంత్రి, అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించినా అనుకున్న ఫలితాలు రాకపోవడంతో లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చే గడువును నేతలు తరచూ పెంచుకుంటూపోతున్నారు. లబ్ధిదారుల తరఫున రుణం కింద బ్యాంకులు టిడ్కోకు రూ.4వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.7 కోట్లే ఇచ్చాయి. దీంతో గడువులోగా గృహాలను పూర్తి చేయడం ఎలా అని అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.

రాష్ట్రంలో టిడ్కో ఇళ్లు
రాష్ట్రంలో టిడ్కో ఇళ్లు

గత ప్రభుత్వం 3.19 లక్షల గృహ నిర్మాణాలను చేపట్టగా వైకాపా అధికారం చేపట్టగానే 51వేల ఇళ్లను రద్దు చేసింది. మిగతా 2.62 లక్షల ఇళ్లను మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ.13వేల కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. లబ్ధిదారుల తరఫున బ్యాంకులు ఇవ్వాల్సిన రూ.4వేల కోట్ల రుణం, వివిధ ఆర్థిక సంస్థల నుంచి మరో రూ.6వేల కోట్లు వడ్డీకి తెచ్చి పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఆ మేరకు రూ.6వేల కోట్లను 8-10% వడ్డీతో సేకరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. హడ్కో, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ), మరో 3 వాణిజ్య బ్యాంకులను సంప్రదించారు. హడ్కో, ఎన్‌హెచ్‌బీ రుణ మంజూరుకు కొర్రీలు పెడుతుండగా.. అవి ఇస్తేనే మేం ఇస్తామంటూ వాణిజ్య బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇన్నాళ్లు టిడ్కో ఇళ్లపై నెలకొన్న సందిగ్ధత వల్ల అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ఆలోచిస్తున్నాయని తెలుస్తోంది.

వెయ్యి కోట్లు సమకూరినా 85వేల ఇళ్లు ఇచ్చేయొచ్చు

మొదటి విడతలోని 85,888 ఇళ్లలో 90% గృహాలు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. 24 ప్రాంతాల్లోని గృహ సముదాయాల్లో నీటి శుద్ధి ప్లాంటు (ఎస్‌టీపీ), చిన్న చిన్న పనులనే పూర్తి చేయాలి. ఎస్‌టీపీల నిర్మాణానికి రూ.196 కోట్లు, మిగిలిన సదుపాయాల కల్పనకు రూ.320 కోట్లు అవసరమని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. వీటితోపాటు పెండింగ్‌ బిల్లులు, ఇతరత్రా కలిపి రూ.1000 కోట్లు సమకూరితే 85,888 వేల ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేయొచ్చు.

రూ.400 కోట్లు లబ్ధిదారులకే ఇవ్వాలి

మూడు రకాల విస్తీర్ణాలకు (300 చ.అడుగులు, 365, 430) సంబంధించి లబ్ధిదారుల వాటాను గతంలోనే టిడ్కోకు చెల్లించారు. దాదాపు రూ.750 కోట్ల మేర వసూలైంది. 365, 430 చ.అడుగుల విస్తీర్ణం గల గృహాల లబ్ధిదారుల వాటాలో ప్రభుత్వం 50% రాయితీ ప్రకటించింది. కొంతమందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు. మరికొందరు జగనన్న ఇళ్ల కాలనీల్లో స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సుమారు రూ.400 కోట్ల మేర వెనక్కి ఇచ్చేయాల్సి ఉంది.

గడువును పెంచుతూ పోతున్నారు

తెదేపా, సీపీఐ నిరసనలతో 18 నెలల్లో పెండింగ్‌ పనులన్నింటినీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది. 8 నెలలు గడిచిన తర్వాతా మళ్లీ అదే 18 నెలల గడువులో పూర్తి చేస్తామని అంటోంది. ఇటీవల టిడ్కో గృహాలపై నిర్వహించిన సమీక్షలో 45వేల ఇళ్లను 3 నెలల్లో లబ్ధిదారులకు అందిస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. రుణ మంజూరులో బ్యాంకులు ముందుకు రాకపోతే సాధ్యపడకపోవచ్చని అధికారులు అంటున్నారు.

ఇవీచదవండి.

study survey : తెలుగు రాయలేరు... ఆంగ్లం చదవలేరు... లెక్కలు చేయలేరు

RAKHI WISHES : 'సోదర బంధానికి ప్రతీక రక్షాబంధన్'

ABOUT THE AUTHOR

...view details