ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 13, 2021, 8:23 AM IST

ETV Bharat / city

APSRTC: ఆర్టీసీ ద్వారా అన్ని శాఖల వాహనాలకు డీజిల్‌!

APSRTC: డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో.. అన్ని ప్రభుత్వ శాఖల వాహనాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా డీజిల్‌ సమకూర్చేందుకు రవాణా శాఖ ఓ ప్రతిపాదన చేసింది. ఆర్టీసీ బస్సులకు వినియోగించే డీజిల్‌లో పెట్రోలియం సంస్థలు కొంత రాయితీనిస్తున్నాయి.

APSRTC
APSRTC

APSRTC: అన్ని ప్రభుత్వ శాఖల వాహనాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా డీజిల్‌ సమకూర్చేందుకు రవాణా శాఖ ప్రతిపాదించింది. ఆర్టీసీ బస్సులకు వినియోగించే డీజిల్‌లో పెట్రోలియం సంస్థలు కొంత రాయితీనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల వాహనాలకు ఈ డీజిల్‌నే వాడేందుకు వచ్చిన ప్రతిపాదనపై ఆర్టీసీ ఆసక్తి చూపడం లేదు. చెల్లింపుల్లో జాప్యమైతే ఇబ్బందులొస్తాయని పేర్కొంటోంది. రాష్ట్రంలో ఏపీఎస్‌ఆర్టీసీ పరిధిలో సొంత బస్సులతోపాటు అద్దె బస్సులు కలిపి 11,500 ఉన్నాయి. వీటికి ఏటా 29 కోట్ల లీటర్ల డీజిల్‌ వాడుతున్నారు. నాలుగు పెట్రోలియం సంస్థల నుంచి ఈ డీజిల్‌ను కొంటుంటారు. ప్రతి 15 రోజులకు ఈ సంస్థలు ధర ఖరారు చేస్తుంటాయి. అలాగే బయటి ధరకంటే లీటర్‌కు రూ.2.50 వరకు ఆర్టీసీకి అవి రాయితీనిస్తుంటాయి. గతంలో ఎన్నడూ లేనంతగా డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో.. రవాణాశాఖ కొత్తగా ఓ ప్రతిపాదన చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల వాహనాలకు ఏపీఎస్‌ఆర్టీసీ బంకుల ద్వారా డీజిల్‌ నింపాలని కోరింది. ఆయా జిల్లాల్లో డిపోల పరిధిలో ఉండే ఆర్టీసీ పెట్రోల్‌బంకుల ద్వారా ఇతర శాఖల వాహనాలకు అవసరం మేరకు డీజిల్‌ అందించాలని ప్రతిపాదించింది.

బిల్లులు ఎప్పుడొస్తాయో?:సాధారణంగా ఆర్టీసీ వినియోగించిన డీజిల్‌కు సంబంధించి ఏరోజుకారోజు ఆయా పెట్రోలియం సంస్థలకు చెల్లింపులు చేస్తారు. అయితే ఇతర శాఖల వాహనాలకు డీజిల్‌ను అందిస్తే.. ఆయా శాఖల నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయనేది ప్రశ్నార్థకమవుతోంది. ప్రస్తుతం కొన్ని శాఖల బిల్లులు నెలల తరబడి మంజూరు కావడం లేదు. ఇదే పరిస్థితి డీజిల్‌ బిల్లుల చెల్లింపుల్లో ఉంటే ఇబ్బందేనని ఆర్టీసీ భావిస్తోంది. దీంతో ఇతర శాఖల వాహనాలకు డీజిల్‌ సరఫరాపై ఆర్టీసీ ఆసక్తి చూపడం లేదని సమాచారం. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

OMICRON CASE IN AP: రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు.. విజయనగరం జిల్లా వాసికి నిర్ధారణ

ABOUT THE AUTHOR

...view details