By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 9:37 AM IST
వెంకట్రామిరెడ్డి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించాలి: వర్ల రామయ్య
Varla Ramaiah Complained EC to Suspend Venkatrami Reddy: ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి జగన్ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తున్న ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని తెలుగుదేశం నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ప్రజల డబ్బును జీతంగా తీసుకుంటూ బహిరంగంగా వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సివిల్ కాండక్ట్ రూల్స్ ప్రకారం రామిరెడ్డిని సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించాలన్నారు. జగన్ రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగస్థులు కూడా అదే రీతిలో వెళ్తున్నారు. వెంకటరామిరెడ్డి సెక్రటెరియట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే కాకుండా ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. వెంకటరామిరెడ్డి వైసీపీకి ప్రచారం చేయడంలో చాలా ముందు ఉంటున్నాడు. ప్రజల డబ్బు తీసుకొని జగన్కు ప్రచారం చేయడమేంటి? ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేసినట్లుగా భావిస్తున్నాం. -వర్ల రామయ్య, టీడీపీ నేత