By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 11:43 AM IST
జోగి రమేష్ ఇసుక అక్రమ తవ్వకాలను అధికారులు పట్టించుకోవట్లేదు : బోడె ప్రసాద్
TDP Leader Bode Prasad Stopped Illegal Sand Mining: పెనమలూరు నియోజకవర్గంలో అర్ధరాత్రి మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డుకున్నారు. ఇసుక లారీలను అడ్డగించి క్వారీలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంత్రిని పెనమలూరు వైసీపీ ఇంఛార్జిగా నియమించగానే అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. క్వారీలోని వ్యక్తులను ప్రశ్నిస్తే మంత్రి వాహనాలుగా తెలిసిందని ఆయన అన్నారు. చోడవరం, మద్దూరు గ్రామాలలో గత నాలుగు రోజుల నుంచి అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని బోడె ప్రసాద్ ధ్వజమెత్తారు. అనుమతులు లేకుండా భారీ యంత్రాంలతో తవ్వి ఇసుకను తరలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమ రవాణాపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు బోడె ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ ఎవరు చేస్తున్నారో తేల్చాలంటూ ఇసుక రాంపులోనే బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రసాద్ దుయ్యబట్టారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక తవ్వకాలకు సంబంధించిన అనుమతి పత్రాన్ని చూపించమంటే లేదంటున్నారు. చోడవరం క్వారీలో ప్రతిరోజు కూడా కోటి రూపాయలకుపైగా అక్రమ దందా జరుగుతోంది. మంత్రి జోగి రమేష్ చేస్తున్న అక్రమాలను ప్రజలకు తెలిసేలా చేస్తాం. -బోడె ప్రసాద్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే