వైఎస్సార్సీపీ బాధితులకు న్యాయం చేయాలని నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష - Kovvuru SriLakshmi Protest - KOVVURU SRILAKSHMI PROTEST
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 10:54 AM IST
Kovvuru SriLakshmi Protest : వైఎస్సార్సీపీ పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నేటి నుంచి గుంటూరులోని తన నివాసం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేకతోటి సుచరిత అనుచరుల అరాచకాలపై దిల్లీలో చేతి వేలు కోసుకుని నిరసన తెలిపిన శ్రీలక్ష్మి గుంటూరు లాడ్జిసెంటర్లోని అంబేడ్కర్ బొమ్మ వద్ద ప్రజా సంఘాలు, టీడీపీ నాయకులు, మహిళలతో కలిసి నిరసన తెలిపారు.
అధికార పార్టీ నాయకులు బహిరంగంగా గంజాయి విక్రయిస్తూ, యువతను రౌడీషీటర్లుగా మార్చారని శ్రీలక్ష్మి ఆరోపించారు. వారి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో దిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అధికార పార్టీ నేతల అన్యాయాలపై ఎమ్మెల్యే సుచరిత దగ్గరకు వెళ్లితే పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులపై చర్యలు తీసుకునే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.