By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 10:42 AM IST
ఎన్నికల అల్లర్లతో పల్నాడు పేరును చెగగొట్టారు: జిల్లా ఎస్పీ మలికా గార్గ్ - Malika Garg on Election Violence
Palnadu SP Malika Garg Speech About Election Violence : ఎన్నికల అల్లర్ల కారణంగా పల్నాడు జిల్లా గురించి దేశంలో చెడుగా ప్రచారం జరుగుతోందని, మాచర్ల, నరసరావుపేట పేర్లు ఇండియా అంతటా మార్మోగుతున్నాయని ఎస్పీ మలికా గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం ఇంత తీవ్రంగా ఉందా అని తన బ్యాచ్మేట్స్, స్నేహితులు, బంధువులు అడుగుతున్నారని చెప్పారు. కర్రలు, రాడ్లు చేతుల్లో పట్టుకుని తిరగడం, తలలు పగలగొట్టుకోవడం అవసరమా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో పల్నాడు అత్యంత దారుణంగా ఉందని, కేవలం పది రోజుల్లోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయని 12 వందల మందిని అరెస్టు చేసినట్లు, వారిలో 400 మందిపై రౌడీషీట్లు తెరిచామని వివరించారు. జిల్లాలో జైళ్లు పట్టక రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపిస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని దాన్ని ఉల్లంఘించి ప్రశాంతతకు భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.