By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 6, 2024, 4:44 PM IST
మూడు రాజధానులను మేనిఫెస్టోలో చేర్చగలరా ? - జగన్కు రామకృష్ణ సవాల్
CPI Ramakrishna Comments on YSRCP: ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో దొంగ నాటకానికి తెర తీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. ఎన్నికలు పూర్తయ్యాక విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. జగన్ ముందు మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టాలని సవాల్ చేశారు.
సీఎం జగన్ అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని రామకృష్ణ మండిపడ్డారు. అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులను నట్టేట ముంచారన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని కోసం కేంద్రానికి కనీసం ఒక లేఖ కూడా రాయకుండా రాయలసీమ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో భూకబ్జాలు, దందాలు కొనసాగుతున్న వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. జగన్ విశాఖ రాజధానిగా చేసిన వ్యాఖ్యలు మరో మారు రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే అని ఆరోపించారు.