డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దు - అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు - ceo orders on dwacra - CEO ORDERS ON DWACRA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 10:26 PM IST
CEO Orders on Do nt Organize Events With dwacra : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఎన్నికల కమిషన్ పటిష్ఠమైన చర్యలు చేపడుతుంది. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎప్పటికప్పుడు అధికారులకు తగు సూచనలు చేస్తుంది. తాజాగా ఏపీలో ఉన్న డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా ఎస్హెచ్జీ(SHG) బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దని ఆయన ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు.
ఈమేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్వయం సహాయక బృందాలను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా, బృందంగా డ్వాక్రా సంఘాలను రాజకీయంగా ప్రభావితం చేసే నిర్ణయాలు వద్దని తేల్చి చెప్పారు. అవగాహన పేరుతో సమావేశాల నిర్వహణ, సర్వే తదితర కార్యక్రమాలు నిర్వహించకూడదని సెర్ప్ సీఈవో, మెప్మా మిషన్ డైరెక్టర్లకు ఆదేశాలిచ్చారు.