డిస్కంలకు రూ.13 వేల కోట్ల లోటు - ముగిసినా ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ - APERC Referendum
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 11:40 AM IST
APERC Chairman Justice Nagarjuna Reddy Referendum Announced : డిస్కంలకు దాదాపు 13 వేల కోట్ల రూపాయల లోటు ఉందని, జెన్ కో ఎండీ ద్వారా ప్రభుత్వం చెప్పిందని ఏపీఈఆర్సీ (APERC) ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి అన్నారు. విశాఖ కేంద్రంగా వర్చువల్ విధానంలో విద్యుత్తు నియంత్రణ మండలి చేపట్టిన 2024-25 టారిఫ్ పై ప్రజాభిప్రాయసేకరణ పూర్తయిందన్నారు. 62 మంది తమ అభిప్రాయాలను తెలిపారని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయసేకరణలో ఎక్కువ శాతం ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి ప్రశ్నించారన్నారు. రెండు, మూడేళ్ల ట్రూ ఆఫ్ ఛార్జీలు బిల్లులలో వస్తున్నాయన్నారు.
విద్యుత్తు ప్రమాదాల విషయంలో జరిగిన ప్రాంతంతో సంబంధం లేకుండా బాధితులకు ఈఆర్ సీని వర్తింపు చేయాలని ఆదేశించామన్నారు. ప్రస్తుతం విద్యుత్తు ఛార్జీలు, టారిఫ్ లు పెరిగే అవకాశం లేదని నాగార్జున రెడ్డి తెలిపారు. గృహావసరాలు, పారిశ్రామిక రంగానికి డిస్కం వారు ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదని తెలిపారు. వాస్తవానికి, అంచనాకు మధ్య ఉన్న తేడానే ట్రూ ఆఫ్ ఛార్జీలని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. దానిని ఛార్జీలు పెంచారని అనుకోవడం అవాస్తవం అని తెలియజేశారు.