ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు అందించాలి : మంత్రి అచ్చెన్నాయుడు - SLBC MEETING IN AP

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం - సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను బ్యాంకులు ప్రోత్సహించాలి

SLBC Meeting in AP
SLBC Meeting in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2024, 10:06 PM IST

SLBC Meeting in AP : రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించడానికి బ్యాంకులు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో జరిగిన 228వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 2024 ఏడాదిలో మొదటి త్రైమాసికానికి సంబంధించిన పురోగతిని అచ్చెన్నాయుడు సమీక్షించారు.

ఈ సందర్భంగా బ్యాంకింగ్ కీ ఇండికేటర్స్, 2024-25 మొదటి త్రైమాసిక బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యసాధన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పధకాలు, ఫైనాన్సియల్ ఇన్​క్లూజన్, డిజిటల్ జిల్లాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల విస్తృతి అమలు, ఆర్బీఐ సూచనల అమలుకు సంబంధించిన అంశాలపై ఎస్ఎల్​బీసీ సమావేశం చర్చించింది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏపీలోని కౌలు రైతులు 9 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు. కానీ బ్యాంకులు ఇప్పటి వరకూ కేవలం 2 లక్షల మందికి మాత్రమే రుణాలు అందించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

Atchannaidu on SLBC Meeting : రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఎకరాలను ప్రకృతి సేద్యం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఏపీ సర్కార్ ఆరు రంగాల్లో విధాన నిర్ణయాలను ప్రకటించిందని చెప్పారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వీలుగా బ్యాంకులు ప్రణాళికలు చేయాల్సిందిగా అచ్చెన్నాయుడు సూచించారు.

పీఎం ముద్రా యోజన, విశ్వకర్మ తదితర పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వివిధ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించిందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. అయినా క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాలకు సాంకేతికతను జోడించి వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు బ్యాంకులు సహకరించాలని మంత్రి కోరారు. వరదల సమయంలో బ్యాంకులు అందించిన సహకారానికి అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

ఏపీలో విజన్-2047 డాక్యుమెంట్ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకులు సహకారాన్ని అందిస్తాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓ మణిమేఖలై స్పష్టం చేశారు. సరళమైన ప్రభుత్వం ప్రభావంతమైన పాలన ప్రాతిపదికన చేపడుతున్న కార్యక్రమాలు, పీ4 విధానం అమలు, డిజిటల్ కార్యక్రమ లక్ష్యాల సాధనకు బ్యాంకులు పూర్తిగా సహకరిస్తాయని తెలిపారు. 2024-25 వార్షిక రుణ ప్రణాళిక అమలుకు సంబంధించి ప్రాధాన్యరంగం కింద రూ.3.75 లక్షల కోట్ల రుణాలకు గానూ మొదటి త్రైమాసికంలో 1,36,657 కోట్ల రుణాలు అందించామని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు అందించి ఆదుకోవాలని కోరారు.

జాగ్రత్తగా వ్యవహరించాలి :మరోవైపు కంజప్షన్ రుణాల విషయంలో బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరించాలని రిజర్వు బ్యాంకు అధికారులు సూచనలు చేశారు. డిజిటల్ ట్రాన్స్​ఫర్మేషన్​కు సంబంధించి క్యూఆర్ కోడ్​ను వినియోగించేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. డిజిటల్ కరెన్సీకి సంబంధించి కాకినాడ, మచిలీపట్నంలో పైలట్ ప్రాజెక్టులను రిజర్వు బ్యాంకు ప్రారంభించినట్లు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లకు సిడ్బీ ఆర్ధిక తోడ్పాటు అందిస్తోందని అధికారులు వెల్లడించారు.

"సమయం లేదు మిత్రమా" - ఏపీలో పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే!

'ఎంప్లాయిమెంట్ ఫస్ట్' ప్రభుత్వ విధానం - పెట్టుబడులు వచ్చేలా పాలసీలు: సీఎం చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details