Attacked for not giving holidays :సెలవులు ఇవ్వలేదనే కారణంతో ఓ ఉద్యోగి తన ఉన్నతాధికారిపై విచక్షణారహితంగా దాడి చేయించాడు. సెలవు కోసం అతడి ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రయత్నం చేశాడు. నేరుగా తాను దాడి చేస్తే దొరికిపోతాననే ఆలోచనతో మరో ముగ్గురికి పని అప్పగించాడు. చివరికి నలుగురూ పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నారు.
సెలవులు ఇవ్వడం లేదని ఉన్నతాధికారిపై ఓ ఉద్యోగి దాడి చేయించిన ఘటన ఇది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో జరిగిన దాడి కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం డీఎస్పీ ఎం.రాంబాబు మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని గారమ్మకాలనీలో ఉన్న తపాలా కార్యాలయంలో సురేంద్రకుమార్ ఏఎస్పీగా పనిచేస్తున్నారు. కాగా నవగాం బ్రాంచిలో విధులు నిర్వహిస్తున్న ఏబీపీఎం కె.దుర్గాప్రసాద్ అతడిపై కక్ష పెంచుకున్నాడు. సెలవులు ఇవ్వడం లేదన్న కారణంతో ఆయనపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. నేరుగా తానే దాడిచేస్తే ఉద్యోగానికి ఆటంకం కలుగుతుందని భావించి మరో ముగ్గురితో స్కెచ్ వేశాడు.