Drinking Water Problems in Guntur District : అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా ఉంది అధికారుల తీరు. కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక జనం మురికి నీళ్లు తాగుతున్నా ఓట్లడిగే ప్రజా ప్రతినిధులకు కనబడటం లేదు. కాదు కావాలనే ఇలా చేస్తున్నారని అంటున్నారు విసిగెత్తిన ప్రజలు. ప్రచార ఆర్భాటాలప్పుడు కనిపించని ఎన్నికల నియమావళి దాహంతో అల్లాడిపోతున్న వారికి నీళ్లు అందిస్తుంటే గుర్తొస్తుందా అని కాకుమాను (Kakumanu) ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
కష్టాలు తీర్చలేని ప్రభుత్వం దిగిపోవాలి - ఫిరంగిపురంలో నీటి కోసం ఆందోళన
No Drinking Water Supply in Guntur :గుంటూరు జిల్లా కాకుమానులో 10 రోజులుగా నీటి సరఫరా లేక గ్రామస్థులు అల్లాడిపోతున్నారు. తాగు నీటి (Drinking Water) చెరువు పూర్తిగా ఎండిపోడంతో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. గత్యంతరం లేక రక్షిత మంచి నీటి పథకం వద్ద బావులలో ఉన్న అపరిశుభ్ర నీటినే తోడుకుని దాహం తీర్చుకుంటున్నారు. మరికొందరు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి నీటిని కొనుక్కుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజల దాహం కేకలు మాత్రం అధికారులు, స్థానిక నేతలకు వినబడటం లేదు. నీరు ఎప్పుడు వదులుతారంటూ గ్రామస్థులంతా కలిసి పంచాయతీ అధికారులను నిలదీశారు. అయినా వారి నుంచి సరైన సమాధానం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలతో సతమతమవుతున్నా నాయకులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడిగేందుకు వస్తారు కదా అప్పుడు వారి సంగతి చూస్తామని హెచ్చరించారు.